ఢిల్లీ బీజేపీ తొలి జాబితా విడుదల | Delhi Elections 2025: BJP First List Released | Sakshi
Sakshi News home page

Delhi Elections 2025: ఢిల్లీ ఎన్నికలు.. బీజేపీ తొలి జాబితా విడుదల

Jan 4 2025 1:15 PM | Updated on Jan 4 2025 3:01 PM

Delhi Elections 2025: BJP First List Released

న్యూఢిల్లీ:  ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తొలి జాబితా విడుదల చేసింది. మొత్తం 29 మంది పేర్లను ప్రకటించింది. న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆప్‌ కన్వీనర్‌, మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌పై బీజేపీ తరఫున పర్వేష్‌ వర్మ పోటీ చేయబోతున్నారు. అలాగే కల్‌కాజీ నుంచి సీఎం అతిషిపై పోటీకి రమేష్‌ బిదురిని బీజేపీ రంగంలోకి దింపింది. 

ఢిల్లీ బీజేపీ(BJP) చీఫ్‌ వీరేంద్ర సచ్‌దేవ్‌ ఈ ఎన్నికల్లో పోటీ చేయబోరంటూ తొలి నుంచి ఊహాగానాలు వినిపిస్తున్నాయి . ఈలోపు.. తొలి జాబితాలో ఆయన పేరు లేకపోవడం గమనార్హం. తొలి జాబితాలో ఇద్దరు మహిళలకు చోటు దక్కింది. రేఖా గుప్తా, సుశ్రీ కుమారి రింకూలకు కమలం పార్టీ తొలి జాబితాతో అవకాశం కల్పించింది. 

ఢిల్లీ మాజీ మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌(Kailash Gehlot) కిందటి ఏడాది నవంబర్‌లో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. గత రెండు ఎన్నికల్లో నజఫ్‌గఢ్‌ నియోజక వర్గం నుంచి పోటీ చేసి నెగ్గిన కైలాష్‌.. ఈసారి బీజేపీ తరఫున బిజ్వాసన్ నుంచి పోటీ చేయబోతున్నారు. అలాగే పదేళ్లపాటు షీలా దీక్షిత్‌ కేబినెట్‌లో మంత్రిగా పని చేసిన అరవిందర్‌ సింగ్‌ లవ్లీ.. కిందటి ఏడాది బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన ఈ ఎలక్షన్స్‌లో ఈస్ట్‌ ఢిల్లీ గాంధీనగర్‌ నుంచి పోటీ చేయబోతున్నారు.

ఢిల్లీ అసెంబ్లీ(Delhi Assembly)లో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే ఆమ్‌ ఆద్మీ పార్టీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఢిల్లీ అసెంబ్లీ ఏడవది. దీని గడువు ఫిబ్రవరి 15వ తేదీతో ముగియనుండగా.. ఆలోపు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.

ఢిల్లీకి స్టేట్‌ స్టేటస్‌ వచ్చాక 1993లో జరిగిన తొలి ఎన్నికల్లో బీజేపీ నెగ్గింది. అయితే ఐదేళ్ల పాలనలో ముగ్గురు సీఎంలను మార్చింది. ఆపై జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ  నెగ్గింది. షీలా దీక్షిత్‌ సారథ్యంలో హస్తం పార్టీ హ్యాట్రిక్‌ పాలన సాగించింది. ఇక.. 2013 నుంచి ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికారంలో కొనసాగుతోంది. దీంతో.. 

ఈసారి ఎలాగైనా హస్తినను చేజిక్కించుకోవాలని బీజేపీ(BJP) భావిస్తోంది.  మరోసారి అధికారం దక్కించుకోవాలని ఆప్‌ భావిస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ కూడా ఈసారి అధికారంపై కన్నేసింది. హర్యానా ఎన్నికల తర్వాత ఇండియా కూటమి మిత్రపక్షాలైన ఆప్‌-కాంగ్రెస్‌లు మరోసారి ఢిల్లీ ఎన్నికల ముక్కోణ్ణపు పోటీలో తలపడనున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement