పైసల కోసం కక్కుర్తి.. కానిస్టేబుల్ షిండే గుర్తున్నాడా?​ ఎట్టకేలకు సస్పెన్షన్​ వేటు

Constable Jitendra Shinde Who Was Amitabh Bodyguard Once Suspended - Sakshi

‘బాలీవుడ్​ మెగాస్టార్​ అమితాబ్​ బచ్చన్​ బాడీగార్డు జీతం ఎంతో తెలుసా?’ ‘తెలిస్తే షాకవుతారు’, ‘మీ దిమ్మ తిరిగిపోతుంది’ అంటూ ఆమధ్య వచ్చిన మీడియా కథనాలు.. అతగాడి కొంపముంచాయి. ఏకంగా కోటిన్నర రూపాయలు వెనకేసుకుంటున్నాడని వచ్చిన కథనాలతో ఆ ముంబై పోలీస్​ హెడ్​ కానిస్టేబుల్​ని అమితాబ్​ భద్రతా పేషీ నుంచి తప్పించారు. ఇప్పుడు ఆ కానిస్టేబుల్​ షిండే మళ్లీ సస్పెన్షన్​ వేటుతో వార్తల్లో నిలిచాడు. 
 
ప్రొటెక్షన్​ అండ్​ సెక్యూరిటీ బ్రాంచ్​లో పని చేసే హెడ్​ కానిస్టేబుల్ జితేంద్ర షిండేను బిగ్​బీ అమితాబ్​ బచ్చన్​కు బాడీగార్డుగా నియమించింది ముంబై పోలీస్​ శాఖ. బిగ్​బీ అమితాబ్​కు 2015 నుంచి 2021 ఆగష్టు(కథనాలు వచ్చేదాకా) బాడీగార్డుగా పని చేశాడు. అయితే ఈ పని చేస్తూనే అతను ఏడాదికి కోటిన్నర రూపాయలకు పైగా సంపాదించాడంటూ కథనాలు వచ్చాయి. ఈ ఆరోపణలను సీరియస్​గా పరిగణనలోకి తీసుకున్న ముంబై కమిషనర్​ హేమంత్​ నగరలే ఆ సమయంలో షిండేను అమితాబ్​ సెక్యూరిటీ విభాగం నుంచి తప్పించి.. హడావిడిగా డీబీ మర్​ పోలీస్టేషన్​కు బదిలీ చేశారు.

అయితే ఈ ఘరానా కానిస్టేబుల్​పై తాజాగా సస్పెన్షన్​ వేటు పడింది. పైఅధికారుల అనుమతి లేకుండా దుబాయ్​, సింగపూర్​లకు ట్రిప్​ల మీద వెళ్లాడని, లగ్జరీగా లక్షలు ఖర్చుపెట్టాడని(వీటికి లెక్కలు లేవు).. పైగా రూల్స్​ విరుద్ధంగా వ్యవహరించాడన్న ఈ కారణంతోనే అతన్ని సస్పెండ్​ చేస్తున్నట్లు సీనియర్​ అధికారి ఒకరు వెల్లడించారు. అయితే వేటుపడినా.. షిండేపై అవినీతిపై దర్యాప్తు మాత్రం కొనసాగుతుందని వెల్లడించారాయన. 

ఇదిలా ఉంటే అమితాబ్​ బచ్చన్​కు ఎక్స్​ కేటగిరీ సెక్యూరిటీ కింద నలుగురు పోలీస్​ కానిస్టేబుళ్లను మొత్తం రెండు షిప్ట్​ల వారీగా అందిస్తోంది ముంబై పోలీస్​ శాఖ. గతంలో అమితాబ్​కు బాడీ గార్డు విభాగంలో పని చేసే సమయంలో.. జితేంద్ర షిండే తన భార్య ద్వారా ఒక ప్రైవేట్​ సెక్యూరిటీ ఏజెన్సీని తెరిపించాడు. ఆ ఏజెన్సీ ద్వారా బచ్చన్​ కుటుంబ సభ్యులకు సేవలందిస్తూ లక్షలు గడించాడు. అయితే ఆ డబ్బంతా ఆ భార్య అకౌంట్​లోకి కాకుండా.. షిండే అకౌంట్​లోకి జమ కావడంతోనే ఈ అవినీతి వ్యవహారం వెలుగు చూసింది. ప్రభుత్వ విధుల్లో ఉంటూ ప్రైవేట్​గా డబ్బు సంపాదించడంపై ముంబై పోలీస్​ శాఖ సీరియస్​ అయ్యింది. ఇదేకాకుండా లెక్కల్లో చూపించని కోట్ల రూపాయలతో అక్రమ ఆస్తుల్ని సైతం కొనుగోలు చేసినట్లు షిండే మీద ఆరోపణలు వినిపించాయి. షిండే అవినీతి ఆరోపణల వ్యవహారంపై ముంబై సౌత్​ అదనపు కమిషనర్​ దిలీప్​ సావంత్​ నేతృత్వంలోని ఓ కమిటీతో దర్యాప్తు నడుస్తోంది కూడా.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top