న్యూఢిల్లీ: హైదరాబాద్కు చెందిన ఏఐఎంఐఎం (మజ్లిస్) పార్టీ బిహార్ రాజకీయాల్లో కీలక శక్తిగా అవతరించింది. సీమాంచల్ ప్రాంతంలోని 29 నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఈ పార్టీ ఐదు సీట్లు గెలుచుకుంది. కేవలం ఆరు స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీతో దాదాపు సమానమైన విజయాన్ని నమోదు చేసింది.
బిహార్ అసెంబ్టీ ఎన్నికల్లో మజ్లిస్ రెండు శాతం ఓట్లను దక్కించుకుంది. ఇది ఆ పార్టీకి పెరుగుతున్న ఆదరణను సూచిస్తుంది. దేశవ్యాప్తంగా ముస్లింలకు ప్రతినిధిగా తన పార్టీని విస్తరించాలని ఓవైసీ ప్రయత్నిస్తుండగా, బిహార్ లాంటి రాష్ట్రాలలో ఆయనకు ఆదరణ లభిస్తోంది. 2015 బిహార్ ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసిన మజ్లిస్, కిషన్గంజ్లో ఒక స్థానం గెలిచింది. అయితే అదే సమయంలో ప్రధానంగా కాంగ్రెస్-ఆర్జేడీ కూటమికి పడే ముస్లిం ఓట్లను పెద్దఎత్తున చీల్చింది.
2020లో ఈ బలం మరింత పెరిగి ఏకంగా ఐదు సీట్లు గెలుచుకుంది. దీంతో ముస్లిం ఓటును విభజించడం ద్వారా ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రాకుండా అడ్డుకుని, పరోక్షంగా బీజేపీకి లాభం చేకూర్చిందన్న విమర్శలు మజ్లిస్పై వచ్చాయి. దీంతో కాంగ్రెస్, ఆర్జేడీలు మజ్లిస్పై కినుక వహించాయి. కాగా బీజేపీకి అవకాశం ఇవ్వకుండా ఉండాలనే లక్ష్యంతో ఓవైసీ, ఈసారి బీహార్లోని ఇండియా కూటమిలో భాగస్వామి కావడానికి ప్రయత్నించారు. అయితే, ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్ మజ్లిస్ను కూటమిలోకి చేర్చుకోవడానికి నిరాకరించారు.
దీంతో మజ్లిస్ ఒంటరిగా 29 స్థానాల్లో పోటీ చేసి మళ్లీ ఐదు సీట్లు గెలుచుకుంది. అలాగే ఓట్ల శాతాన్ని రెండుకు పెంచుకోవడం ద్వారా కాంగ్రెస్ కూటమికి తీవ్ర నష్టం కలిగించింది. ముస్లిం ఓట్ల విభజన కారణంగా కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి 30 కంటే ఎక్కువ స్థానాలు కోల్పోయిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బీహార్ అసెంబ్లీలో కాంగ్రెస్ కంటే ఏఐఎంఐఎంకు ఎక్కువ మంది ముస్లిం ఎమ్మెల్యేలు ఉండటం గమనార్హం.
ఇది కూడా చదవండి: Bihar Election: డబుల్ షాక్లో ‘బిహార్ సింగం’


