
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఇది రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ అంశంపై పలు రకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వ నిర్షక్ష్యమే ఈ ఘటనకు కారణమనే వాదన వినిపిస్తోంది. ఇంతకీ ఈ ఘటన ఏమిటనుకుంటున్నారా? అదే.. ‘మధ్యాహ్న భోజనాన్ని కుక్క ముట్టడం’ వివరాల్లోకి వెళితే..
ఛత్తీస్గఢ్లోని బలోడబజార్ జిల్లాలోని లాచాన్పూర్ గ్రామంలోని ప్రభుత్వ మిడిల్ స్కూల్లో విద్యార్థుల కోసం వండిన ఆహారాన్ని కుక్క ముట్టుకుంది. దీనిని గమనించిన విద్యార్థులు ఈ విషయాన్ని ఉపాధ్యాయులకు చెప్పినప్పటికీ, వారు పట్టించుకోలేదు. దీనికితోడు ఆహారాన్ని వండిన స్వయం సహాయక బృందం(ఎస్హెచ్జీ) ఈ ఆహారమేమీ కలుషితం కాలేదంటూ విద్యార్తులకు వడ్డించింది. అయితే ఈ ఘటన వెలుగులోకి రావడంతో అప్రమత్తమైన ఎస్చ్జీ ఆ రోజు మధ్యాహ్న భోజనం చేసిన 78 మంది విద్యార్థులకు యాంటీ రాబీస్ టీకాలు ఇప్పించింది.
ఈ ఘటన తరువాత విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాఠశాల నిర్వహణ కమిటీని నిలదీశారు. ఎస్హెచ్జీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆ కమిటీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు ఉప-డివిజనల్ మేజిస్ట్రేట్ దీపక్ నికుంజ్, బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నరేష్ వర్మ, ఇతర అధికారులు ఘటన జరిగిన పాఠశాలను సందర్శించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అయితే ఎస్హెచ్జీ సభ్యులు అధికారుల దర్యాప్తులో పాల్గొనలేదు. ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే సందీప్ సాహు ముఖ్యమంత్రి విష్ణు డియో సాయికి లేఖ రాశారు. ఈ ఉదంతంపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.