ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థులను కాలేజీ బయటే ఉంచిన యాజమాన్యం (ఫైల్)
హుకుం జారీ చేసిన ఎన్ఎస్ఆర్ఐఈటీ యాజమాన్యం
తగరపువలస: ఫీజులు చెల్లించకపోతే కాలేజీకి రావద్దని విశాఖ జిల్లా భీమిలి మండలం దాకమర్రిలోని నడింపల్లి సత్యనారాయణరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (ఎన్ఎస్ఆర్ఐఈటీ) యాజమాన్యం విద్యార్థులకు హుకుం జారీ చేసింది. ఈ కళాశాలలో ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా చేరిన మొదటి సంవత్సరం విద్యార్థులను రెండు నెలలుగా యాజమాన్యం వేధిస్తున్నట్టు సమాచారం. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం ఫీజురీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నందున యాజమాన్యం గత నవంబరులో ఫీజులు కట్టాలంటూ తల్లిదండ్రులకు సమాచారమిచి్చంది.
దీంతో విద్యార్థులు తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకువచ్చి అతి కష్టం మీద రూ.10వేలు చొప్పున చెల్లించారు. జనవరి 27న కూడా రెండో విడత ఫీజులు చెల్లించని విద్యార్థులను తరగతి గదుల్లోకి అనుమతించకుండా కాలేజీ యాజమాన్యం ఆవరణలో నిలబెట్టింది. ఫీజులు చెల్లిస్తేనే కళాశాలకు రావాలంటూ హుకుం జారీ చేసింది. దీనిపై తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యానికి ఫోన్ చేసి బతిమాలినా, స్పందించకపోగా దూకుడుగా సమాధానమిచ్చారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజులు కచి్చతంగా చెల్లించాల్సిందేనని కాలేజీ యాజమాన్యం స్పష్టం చేయడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. తక్షణం ప్రభుత్వం కలగజేసుకుని, సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.


