‘శత’క్కొట్టిన ప్రజ్ఞయ్ రెడ్డి
ఛత్తీస్గఢ్ రెండో ఇన్నింగ్స్ 100/2
సాక్షి, హైదరాబాద్: బ్యాటర్లు దంచికొట్టడంతో రంజీ ట్రోఫీ చివరి లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు భారీ స్కోరు చేసింది. గ్రూప్ ‘డి’లో భాగంగా సికింద్రాబాద్ జింఖానా మైదానంలో ఛత్తీస్గఢ్తో జరుగుతున్న మ్యాచ్లో ఓవర్నైట్ స్కోరు 415/4తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ 154 ఓవర్లలో 631 పరుగులకు ఆలౌటైంది.
ప్రజ్ఞయ్ రెడ్డి (126; 14 ఫోర్లు, 4 సిక్స్లు) సెంచరీతో కదం తొక్కగా... క్రితం రోజే శతకం పూర్తి చేసుకున్న హిమతేజ (258 బంతుల్లో 171; 18 ఫోర్లు, 1 సిక్స్) డబుల్ సెంచరీ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఛత్తీస్గఢ్ శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి 39 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది.
జ్ఞానేశ్వర్ డబుల్ సెంచరీ
రంజీ ట్రోఫీ గ్రూప్ ‘ఎ’లో భాగంగా నాగాలాండ్తో సావోమిలో జరుగుతున్న మ్యాచ్లో ఆంధ్ర జట్టు భారీ స్కోరు చేసింది. ఓవర్నైట్ స్కోరు 267/5తో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర జట్టు చివరకు 130 ఓవర్లలో 9 వికెట్లకు 536 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. సీఆర్ జ్ఞానేశ్వర్ (227 నాటౌట్; 21 ఫోర్లు, 4 సిక్స్లు) అజేయ డబుల్ సెంచరీతో కదంతొక్కాడు.
శశికాంత్ (138 బంతుల్లో 60; 5 ఫోర్లు), త్రిపురాన విజయ్ (94 బంతుల్లో 58; 2 ఫోర్లు, 2 సిక్స్లు) అతడికి సహకారం అందించారు. అనంతరం నాగాలాండ్ శనివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 33 ఓవర్లలో 4 వికెట్లకు 85 పరుగులు చేసింది.


