
ఢిల్లీ: బాల సాహిత్య, యువ పురస్కారాలను కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించింది. 24 భాషల్లో ఉత్తమ రచనలను ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. తెలుగు భాషకు సంబంధించి గంగిశెట్టి శివకుమార్ రచించిన 'కబుర్ల దేవత' (స్టోరీ) పుస్తకానికి కేంద్ర బాల సాహిత్య పురస్కారం లభించింది. సాహిత్య యువ పురస్కారానికి ప్రసాద్ సూరి రచించిన మైరావణ నవల ఎంపికైంది.
భారతీయ భాషల్లో సాహిత్య రంగంలో పలు పుస్తకాలను ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు జ్యూరీ సభ్యులు సిఫారసు చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ నేతృత్వంలోని సాహిత్య అకాడమీ ఎగ్జిక్యూటివ్ బోర్డు అవార్డు గ్రహీతల వివరాలు వెల్లడించింది. ఈ ఏడాది డోగ్రీ భాషకు సంబంధించి యువ పురస్కారాన్ని ప్రకటించలేదు. 23 భాషల్లో ప్రచురితమైన పుస్తకాలకు మాత్రమే యువ పురస్కారాలను ప్రకటించింది.