బిహార్: నకిలీ ధ్రువపత్రాల ఆధారంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగాలు పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 3,035 మంది ఉపాధ్యాయులను బిహార్ విద్యాశాఖ విధుల నుంచి తొలగించింది. ఈ ఉపాధ్యాయులకు ఎన్నో ఏళ్లుగా జీతాల రూపంలో చెల్లించిన దాదాపు రూ.1,400 కోట్లను వడ్డీతో పాటు వెనక్కి వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2006 నుంచి 2015 మధ్య స్థానిక సంస్థల ద్వారా జరిగిన ఉపాధ్యాయ నియామకాల్లో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో సమగ్ర దర్యాప్తు చేపట్టారు.
ఈ వ్యవహారంపై పాట్నా హైకోర్టు అప్రమత్తత దర్యాప్తు బ్యూరోను దర్యాప్తునకు ఆదేశించిన తర్వాత ఈ కుంభకోణం బయటపడింది. ఆయా ఉపాధ్యాయులు నకిలీ కుల ధ్రువపత్రాలు, ఆధార్, వయస్సు, దివ్యాంగ ధ్రువపత్రాలు, విద్యార్హత ధ్రువపత్రాలు సమర్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దర్యాప్తులో పలువురు ఉపాధ్యాయులు నకిలీ సీటెట్, టెట్ ధ్రువపత్రాలు వినియోగించినట్లు గుర్తించారు. కొన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు జారీ చేసిన డిగ్రీలు కూడా నకిలీవేనని తేలింది.
బిహార్ విద్యాశాఖ మంత్రి మిథిలేష్ తివారీ మాట్లాడుతూ, ఈ తొలగింపులు పెద్ద ఎత్తున చేపట్టనున్న చర్యలకు ఆరంభం మాత్రమే అని చెప్పారు. "ఈ దర్యాప్తు చాలా కాలంగా కొనసాగుతోంది. 3,000 మందికిపైగా ఉపాధ్యాయులు నకిలీ డిగ్రీలతో ఉద్యోగాలు పొందినట్లు అధికారులు గుర్తించారు. కఠిన చర్యలు తీసుకోవాలని మా శాఖ అధికారులను ఆదేశించాం. ఇకపై ఇలాంటి మోసపూరిత చర్యలకు ఎవరూ పాల్పడే ధైర్యం చేయకుండా విద్యాశాఖ అత్యంత కఠిన చర్యలు అమలు చేస్తుంది" అని తెలిపారు.


