
అహ్మదాబాద్: దేశంలో సంభవించిన అత్యంత ఘోర విమాన ప్రమాదాలలో గుజరాత్లోని అహ్మదాబాద్లో చోటుచేసుకున్న ప్రమాదం ఒకటి. ఈ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని కంటతడి పెట్టించింది. గుజరాత్లోని ఆనంద్కు చెందిన వ్యాపారవేత్త బద్రుద్దీన్ హలానీ కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. లండన్లోని తన ముద్దుల మనవరాళ్లలో ఆనందంగా ఆడుకోవాలనే ఆశతో బయలుదేరిన ఆయన అంతలోనే అనంతవాయువుల్లో కలిసిపోయారు.
బద్రుద్దీన్ హలానీ తన భార్య యాస్మిన్, వదిన మాలెక్తో కలిసి విమానంలో లండన్ బయలుదేరారు. అక్కడ తన మనవరాళ్లతో కలసి ఆడుకుంటూ కాలం గడపాలని ఎన్నో కలలుగన్నారు. అలాగే తన కలల ప్రాజెక్ట్ అయిన సిల్వాసాలోని ఆర్ఎస్ఎస్ఎస్ అనుబంధ సైనిక్ స్కూల్ కోసం నిధులు సేకరించేందుకు అమెరికా వెళ్లాలని కూడా బద్రుద్దీన్ హలానీ ప్లాన్ చేసుకున్నారు. అతని సోదరుడు రాజుభాయ్ హలానీ మీడియాతో మాట్లాడుతూ.. తన అన్న సామాజిక సేవ చేయడంలో ముందుంటారని, సిల్వాసాలోని సైనిక్ స్కూల్ నెలకొల్పాలని అనుకున్నారన్నారు. లండన్లో తన మనవరాళ్లతో ఆనందంగా కాలం గడపాలని అనుకున్నారని తెలిపారు.
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే బద్రుద్దీన్ కుమారుడు అసిమ్ హలానీ లండన్ నుంచి అహ్మదాబాద్కు చేరుకున్నారు. తన తండ్రి మృతదేహాన్ని గుర్తించేందుకు తన డీఎన్ఏ నమూనాను ఆసుపత్రి సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నా ఇద్దరు కుమార్తెలు.. తాతనాన్నమ్మ లండన్ వస్తున్నారని తెలిసి చాలా ఉత్సాహంగా ఉన్నారు. తాత కోసం గ్రీటింగ్ కార్డులు కూడా తయారు చేశారు. ఇప్పుడు ఆ కార్డులను ఎవరికి ఇస్తారు? మా కుటుంబానికి తట్టుకోలోని పరిస్థితి ఎదురయ్యింది. మా నాన్న నన్ను ఎప్పుడూ కొట్టలేదు. నేను ఏ బొమ్మ అడిగితే, అది కొనిచ్చారు. అదే ప్రేమ మనవరాళ్లకు కూడా ఇస్తారని అనుకున్నాను’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు.
ఇది కూడా చదవండి: Air India Plane Crashed: ప్రమాదాన్ని తొలుత చూసింది ఇతనే.. వెంటనే ఏం చేశారంటే..