వెహికల్‌ ఇంజన్లకు ఇథనాల్‌ టెన్షన్‌

AutoMobile Industry is  Confusing With Government Policy Of 20 Percent Ethanol Fuel - Sakshi

పెట్రోల్‌లో ఇథనాల్‌ శాతం పెంచాలన్న కేంద్రం

ఇథనాల్‌ శాతం పెరిగితే ఇంజన్‌పై ప్రభావం ?

ఇథనాల్‌ శాతం పెంపుపై మిశ్రమ స్పందన 

వెబ్‌డెస్క్‌ : కేంద్రం ప్రకించిన ఇథనాల్‌ రోడ్‌మ్యాప్‌ 2020-25పై ఆటోమోబైల్‌ పరిశ్రమపై ఎటువంటి ప్రభావం పడనుంది. పెట్రోల్‌లో ఇథనాల్‌ శాతం 20కి పెరిగితే ఇంజన్లపై ఏ విధమైన ప్రభావం ఉంటుంది. సాంకేతిక సమస్యలు తలెత్తుతాయా ? మెయింటనెన్స్‌ పెరుగుతుందా ? ఇలా అనేక సందేహాలు ఇటు పరిశ్రమ వర్గాల నుంచి అటు వాహనదారుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించి ఆటోమొబైల్‌ రంగ నిపుణులు ఏమంటున్నారంటే...

20 శాతం ఇథనాల్‌ 
కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు పెట్రోలు దిగుమతి భారాన్ని తగ్గించుకునేందుకు లీటరు పెట్రోలులో ఇథనాల్‌ శాతాన్ని  రాబోయే రోజుల్లో 20 శాతానికి పెంచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. 2025 కల్లా ఈ లక్ష్యాన్ని సాధించాలని చెప్పారు. అందుకు తగ్గట్టుగా ఇథనాల్‌ ఉత్పత్తిని పెంచాలంటూ ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారు 

2014 నుంచి
పెట్రోలులో ఇథనాల్‌ని మిక్స్‌ చేయడం 2014 నుంచి ప్రారంభమైంది. మొదట 1 నుంచి 1.5 శాతం వరకు ఇథనాల్‌ కలిపేవారు. ప్రస్తుతం లీటరు పెట్రోలులో 8.5 శాతం ఇథనాల్‌ కలిపి చమురు సంస్థలు విక్రయిస్తున్నాయి. దీన్ని రాబోయే మూడేళ్లలో 20 శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇంజన్లపై ప్రభావం ?
కార్లను తయారు చేసేప్పుడు స్వచ్ఛత ఎక్కువగా పెట్రోలు, డీజిల్‌లు ఉపయోగించేలా డిజైన్‌ చేస్తారు. పెట్రోలు స్వచ్ఛత తగ్గితే సాధారణంగానే ఇంజనుపై ప్రభావం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. మరోవైపు సాధారణంగా పెట్రోలుకు మండే స్వభావం ఎక్కువ. తద్వారా ఇంజన్‌కి ఎక్కువ మొత్తంలో ఉష్ణశక్తి లభిస్తుంది. పెట్రోలుతో పోల్చినప్పుడు ఇథనాల్‌కి మండే స్వభావం తక్కువగా ఉంటుంది. పెట్రోలులో ఇథనాల్‌ శాతం పెరిగితే క్రమంగా ఇంజన్‌ సామర్థ్యం తగ్గే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

ఇథనాల్‌ తినేస్తుంది
ఇథనాల్‌ కరోసివ్ లక్షణం కలిగి ఉంటుంది. ముఖ్యంగా ప్లాస్టిక్‌, రబ్బర్‌ పదార్థాలను ఇథనాల్‌ కాలక్రమేనా తినేస్తుంది. పెట్రోల్‌లో ఇథనాల్‌ శాతం పెరిగితే ట్యాంకు పెట్రోలు పోయడం దగ్గర నుంచి ఇంజన్‌లో శక్తి వెలువడే వరకు  ఇంజన్‌, వాహనం విడిభాగాలు ఇథనాల్‌ కారణంగా చెడిపోయే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం 8.5 శాతం ఇథనాల్‌ కలిసిన పెట్రోల్‌ దేశవ్యాప్తంగా ఉపయోగిస్తున్నా పెద్దగా సమస్యలు రాలేదు , కాబట్టి 20 శాతం ఇథనాల్‌ కలిపినా సమస్యలు రాకపోవచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. 

అయోమయం
కాలుష్యాన్ని తగ్గించాలనే లక్ష్యంతో అన్ని కార్లు, వాహనాల తయారీ సంస్థలు ఎలక్ట్రిక్‌ వాహనాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాయి. అంతకు ముందు బీఎస్‌ 6 ప్రమాణాలకు తగ్గట్టు ఇంజన్‌ డిజైన్లలో మార్పులు చేశాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇథనాల్‌ శాతం పెంచడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడం తమ లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆటోమొబైల్‌ పరిశ్రమ వర్గాలు అయోమయంలో పడ్డాయి.

చదవండి: పెట్రోల్‌లో 20% ఇథనాల్‌!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top