Assembly Elections 2023 Schedule For Meghalaya, Nagaland And Tripura Announced - Sakshi
Sakshi News home page

2023లో మోగిన అసెంబ్లీ ఎన్నికల నగారా.. ఈశాన్య రాష్ట్రాల్లో మూడింటి ఎన్నికల తేదీలు ఇవే

Jan 18 2023 3:05 PM | Updated on Jan 18 2023 4:21 PM

Assembly Elections For Meghalaya Nagaland Tripura Announced - Sakshi

2023 తొలి భాగంలో మూడు రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది. ఈశాన్య రాష్ట్రాలైన.. 

న్యూఢిల్లీ: 2023లో తొలి భాగంలో.. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్‌, మేఘాలయా, త్రిపురలకు ఎన్నికల తేదీలను ప్రకటించింది. ఒకే దఫాలో ఈ మూడు రాష్ట్రాల ఎన్నికలు నిర్వహించనున్నట్లు బుధవారం మధ్యాహ్నం పాత్రికేయ సమావేశం నిర్వహించి.. వివరాలను వెల్లడించారు సీఈసీ రాజీవ్‌ కుమార్‌.

మొత్తం 60 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న నాగాలాండ్‌కు ఫిబ్రవరి 27వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 13,09, 651 మంది ఓటర్లు ఉన్నారు అక్కడ. అందులో 59 స్థానాలు ఎస్టీ కేటాయింపు కాగా, జనరల్‌ కేటగిరీ ఒక్క స్థానానికే ఉంది. 

ఇక 12 జిల్లాలతో 60 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న మేఘాలయా అసెంబ్లీకి ఫిబ్రవరి 27వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 21,61,129 ఓటర్లు ఉన్నారు అక్కడ. 55 స్థానాలు ఎస్టీ, జనరల్‌ కోటాలో 5 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

ఎనిమిది జిల్లాలు.. 60 స్థానాలు ఉన్న త్రిపుర అసెంబ్లీకి ఫిబ్రవరి 16వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 28,13,478 మంది ఓటర్లు ఉన్నారు అక్కడ. ఇక్కడ 30 జనరల్‌, ఎస్సీ 10, ఎస్టీ 20 స్థానాలు ఉన్నాయి. 

మొత్తం 180 స్థానాలకు జరగబోయే ఎన్నికల కోసం 9,125 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు సీఈసీ రాజీవ్‌ కుమార్‌ ప్రకటించారు. మార్చి 2వ తేదీన మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు.

ప్రస్తుతం ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో కొనసాగుతోంది. త్రిపుర (Tripura)లో మాణిక్‌ సాహా నేతృత్వంలోని ప్రభుత్వం, మేఘాలయా, నాగాలాండ్‌సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా ఉంది బీజేపీ.

నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీల ఐదు సంవత్సరాల పదవీకాలం వరుసగా మార్చి 12, మార్చి 15, మార్చి 22వతేదీల్లో ముగియనుంది. మార్చి నెలాఖరులోగా మూడు ఈశాన్య రాష్ట్రాల్లో కొత్త అసెంబ్లీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. గత వారం.. మూడు ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించి రాజకీయ పార్టీలు, రాష్ట్ర, కేంద్ర భద్రత, పౌర అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించింది.  రాజకీయ పార్టీలు, స్థానిక యంత్రాంగం, పోలీసు సిబ్బంది అభిప్రాయాలు తీసుకుంది. ఈ మేరకు పక్కాగా ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేస్తున్నట్లు కేంద్రం ఎన్నికల సంఘం ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement