ముంబై: మహారాష్ట్రలోని బీడ్ జిల్లా, పార్లీకి చెందిన దహిఫలే కుటుంబంలో ఐదు తరాల (దాదాపు 200 ఏళ్ల) నిరీక్షణ తర్వాత ఒక ఆడబిడ్డ జన్మించింది. ఐదు తరాలుగా కేవలం మగపిల్లలే జన్మిస్తున్న ఈ కుటుంబంలోకి లక్ష్మీదేవిలా పాప అడుగుపెట్టడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఆ చిన్నారికి ‘గార్గి’ అని నామకరణం చేశారు.
సౌభాగ్యవతి కల్పన రిషికేష్ దహిఫలే ఇటీవల ఈ ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అనంతరం తల్లిని, నవజాత శిశువును ఇంటికి తీసుకువచ్చేందుకు కుటుంబ సభ్యులు ఎవరూ ఊహించని రీతిలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. పూలతో అందంగా అలంకరించిన ఒక ప్రత్యేక రథంలో తల్లిని, చిన్నారి గార్గిని కూర్చోబెట్టారు. డప్పులు, తాళాల వాయిద్యాలు, సంబరాల నడుమ గ్రామంలో కోలాహలంగా ఊరేగింపు నిర్వహించారు. దహిఫలే కుటుంబం ఆ చిన్నారిని యువరాణిలా చూసుకుంటుండగా స్థానికులు, గ్రామస్తులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
కుటుంబ సభ్యుల భావోద్వేగం
ఈ సందర్భంగా గార్గి తాత లింబాజీ దహిఫలే మాట్లాడూతూ.. మా కుటుంబంలో కుమార్తె ఉండటం గొప్ప అదృష్టం. చాలా ఏళ్లుగా మాకు ఉన్న ఒకే ఒక్క వెలితి నేటితో తీరిపోయింది. ఈ రోజు లక్ష్మీదేవి స్వయంగా మా ఇంటికి వచ్చినట్లు అనిపిస్తోంది’అని పాప అమ్మమ్మ సురేఖ దహిఫలే ఆనందం వ్యక్తం చేశారు. గార్గి తండ్రి రిషికేష్ మాట్లాడుతూ.. సాధారణంగా సమాజంలో చాలామంది కొడుకు కావాలని కోరుకుంటారు. కానీ ఆడపిల్ల తెచ్చే ఆనందం, అనుభూతే వేరు. కుమార్తెలు తండ్రులకు ప్రత్యేకం. మా పాపను అపురూపంగా పెంచుకుంటాం’ అని తెలిపారు.
సమాజంలో ఆడపిల్లల పట్ల ఉన్న వివక్షను పోగొట్టి, ఆడబిడ్డ జననం అనేది ఎంతో సంతోషం, గర్వకారణమైన విషయమని సమాజానికి ఒక సానుకూల సందేశం ఇవ్వడానికే ఈ వేడుకను ఇంత ఘనంగా నిర్వహించినట్లు దహిఫలే కుటుంబం పేర్కొంది


