
ఆపరేషన్ సిందూర్ వేళ సైనికులకు టీ, పాలు, లస్సీ,
మంచినీళ్లు, ఐస్ అందించిన పదేళ్ల బాలుడు
చండీగఢ్: జనం కేవలం బాంబు శబ్దం వినపడితేనే ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోతారు. అదే బాంబులు పడుతుంటే అసలు కనుచూపు మేరలో జనం కనపించరు. కానీ పదేళ్ల బాలుడు కాల్పుల మోతకు ఏమాత్రం భయపడకుండా తాపీగా వచ్చి భారత సైనికులకు ఛాయ్, లస్సీ, మంచినీళ్లు.. ఇలా చిరు ఆహార పదార్థాలు ఇచ్చి ఔరా అనిపించాడు. బాలుడి ధైర్యసాహసాలు మెచ్చి భారత ఆర్మీ సత్కరించింది. 7వ ఇన్ఫ్యాంట్రీ డివిజన్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ అయిన మేజర్ జనరల్ రంజిత్ సింగ్ మన్రాల్ స్వయంగా గ్రామానికి వెళ్లి బాలుడిని అభినందించారు.
పాకిస్తాన్ సైనికులకు తూటాలతో జవాబు చెప్తూ యుద్ధంలో మునిగిపోయిన భారత సైనికులకు తాగునీరు, తేనీరు, పాలు, లస్సీ, ఐస్ అందించిన ఈ అబ్బాయి పేరు శ్రవణ్ సింగ్. వయసు కేవలం పదేళ్లు. పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లాలోని మామ్దోత్ పరిధిలోని తారావాలీ గ్రామం ఇతని స్వస్థలం. ఈ గ్రామం పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉంది. దీంతో ఆపరేషన్ సిందూర్ వేళ ఈ గ్రామంపైనా పాకిస్తాన్ కాల్పుల మోత మోగించింది. గ్రామంలో శ్రవణ్సింగ్ కుటుంబానికి కొంత సాగుభూమి ఉంది. ఇక్కడ మొహరించిన భారత సైనికులు పాక్ కాల్పులకు దీటుగా బదులివ్వడం మొదలెట్టారు.
తమ సొంతస్థలంలోకి సైనికుల వచ్చారని తెల్సుకుని శ్రవణ్ వాళ్లకు ఏదోలా సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఫ్లాస్్కలో చాయ్తో పాటు తాగడానికి టీ గ్లాసులు పట్టుకెళ్లి ఇచ్చాడు. పాలు, లస్సీ, మంచినీళ్లు, ఐస్ కూడా అందించాడు. సైనికులకు సాయపడిన బాలుడిని అంతా మెచ్చుకున్నారు. పెద్దయ్యాక సైనికుడినవుతా అని పిల్లాడు బదులిచ్చాడు. ‘‘మా వాడిని చూస్తే నాకెంతో గర్వంగా ఉంది. ఇక సైనికుల సంగతి చెప్పనక్కర్లేదు. మా వాడిని తెగ మెచ్చుకున్నారు’’అని బాలుడి తండ్రి ఆనందంతో చెప్పారు. ‘‘సరిహద్దు గ్రామాల్లో ప్రజలకు కొత్తగా దేశభక్తి నూరిపోయాల్సిన పనిలేదు. చిన్నతనం నుంచే నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉంటుంది’’అని ప్రముఖులు వ్యాఖ్యానించారు.