నారాయణపేట: ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్ఐఆర్ ప్రక్రియను సమర్థవంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఎన్నికల పరిశీలకులు, వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సురేంద్రమోహన్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లాలో పర్యటించిన అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ సీహెచ్ ప్రియాంక, రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రమేష్, ఏఈఆర్వోలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై జిల్లాలో కొనసాగుతున్న సర్ పురోగతిపై సమీక్షించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ఓటర్ల వివరాల పరిశీలన, సవరణలు తదితర అంశాల్లో పారదర్శకత, నిష్పక్షపాతాన్ని పాటించాలని సంబంధిత అధికారులు, ఏఈఆర్వోలకు మార్గదర్శకాలు జారీ చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు తమకు ఎదురవుతున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని, వాటిని నిబంధనల ప్రకారం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఎన్నికల పరిశీలకులు సూచించారు. సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు సుదర్శన్రెడ్డి, మహ్మద్ సలీం, రాఘవ చౌదరి, రాములు, వెంకట్రామారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, కెంచి నారాయణ పాల్గొన్నారు.


