కొత్తపల్లి: రాష్ట్రంలోని పల్లెల్లో పాలన బాగుందని.. ఇలాంటి వ్యవస్థ ఏ రాష్ట్రంలో లేదని, పంచాయతీల అభివృద్ధి, గ్రామాల్లోని కొందరికి ఉపాధి కల్పించడం నచ్చిందని ఢిల్లీ ఇన్స్ట్యూట్ ఆఫ్ ఎకానమిక్ గ్రోత్ ప్రొఫెసర్ల బృందం సరోజ్ కుమార్, రవిరంజన్, మాధవన్ కొనియాడారు. బుధవారం కొత్తపల్లి మండలం భూనీడు, గుండుమాల్ మండలంలోని అమ్లికుంట గ్రామాల్లో బృందం సభ్యులు పర్యటించి వ్యక్తిగత, సామూహిక ఇంకుడు గుంతలు, సెగ్రికేషన్ షెడ్లు, చెత్త సేకరణకు వినియోగించే ట్రాక్టర్ల నిర్వహణ, గ్రామాల్లో నిర్మించిన సామూహిక మరుగుదొడ్ల నిర్వహణను పరిశీలించి రైతువేధికల్లో అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులతో సమావేశమయ్యారు. గ్రామపంచాయతీల్లో ట్రాక్టర్ల నిర్వహణ, మల్టీపర్పస్ ఉద్యోగులకు ఇచ్చే వేతనాల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్మికుల సంఖ్య పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఎం ఫేస్–3 నిధుల మంజూరుతో గ్రామాల రూపురేఖలు మారబోతాయని వివరించారు. జూనియర్ కళాశాల విద్యార్థులతో కాసేపు మాట్లాడారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడే దిశగా పయనించాలని సూచించారు. అనంతరం పాఠశాల ఆవరణలో జిల్లా, మండల అధికారులతో కలిసి మొక్కలు నాటారు. వారి వెంట డీఆర్డీఓ వెంకట్రాములు, ఎస్బీఎం జిల్లా కన్సల్టెంట్ మాలిక్, డీఎల్పీఓ ఉదయ్శంకర్, మిషన్ భగీరథ డీఈ శిరీష, ఎంపీడీఓ కొండన్న, తహసీల్దార్ జయరాములు, పంచాయతీరాజ్ ఏఈ రాఘవేందర్ సర్పంచ్ పుష్ఫ శ్రీనివాస్, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.


