వివరాలు 8లో u
మండుటెండలో కూలీల అవస్థలు
మరికల్: మార్చి ప్రారంభం నుంచే బానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. మండుటెండలో ఉపాధి హామీ పనులు చేసే కూలీల పరిస్థితి దారుణంగా మారింది. పైగా పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు, నీడ కూడా కరువైంది. అత్యవసర మెడికల్ కిట్లు అందుబాటులో ఉండటం లేదు. దీంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కింద పనులు చేస్తున్న కూలీలు కనీస వసతులకు నోచుకోవడం లేదు. అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోకపోతే ఎండలు ముదిరి తమ ఆరోగ్యాలు దెబ్బతినే అవకాశం లేకపోలేదని కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా మొత్తంలో జాబ్ కార్డులు 1,11,421 ఉండగా ప్రతి ఏడాది 60 వేలకు పైగా కూలీలు పనులకు హాజరవుతున్నారు. ప్రస్తుతం 11 మండలాల్లో ఉపాధి పనులు ప్రారంభం కాగా 12,347 మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు.
వసతుల్లేక ఇబ్బందులు
ప్రస్తుతం పాం పాండ్స్, గుట్టల్లో గుంతలు తీయడం, నర్సరీల్లో మొక్కల పనులు జరుగుతున్నాయి. పని చేసే ప్రదేశంలో కూలీలు భోజనం చేయడానికి, అలసటగా ఉన్నప్పుడు సేదతీరడానికి ప్రభుత్వం గుడారాలు పంపిణీ చేసేది. ఏడేళ్ల నుంచి వాటి పంపిణీ నిలిచింది. కనీసం కొత్త ఆర్థిక సంవత్సరంలోనైనా వాటిని అందిస్తే ప్రయోజనం చేకూరుతోంది. ఏడేళ్ల కింద జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ వారు టెంట్లు ఇచ్చారు. మళ్లీ వాటిని వెనక్కి తీసుకున్నారు. గతంలో మెడికల్ కిట్లు పంపిణీ చేసేది. గాయాలపాలైనా, ఒంట్లో నీటిశాతం తగ్గినప్పుడు కనీసం ప్రథమ చికిత్స చేయడానికి కిట్లను పంపిణీ చేయాల్సింది. ఓఆర్ఎస్ ప్యాకెట్, బ్యాండెడ్, దూది, అయోడిన్ సీసా, కొన్ని రకాల మందులు ఉండేవి తొమ్మిదేళ్లుగా కిట్లను కూడా పంపిణీ చేయడం లేదు. అయితే, ఎండలో ఎక్కువ సేపు పని చేయటం వల్ల కూలీలకు వడదెబ్బ తగిలే ప్రమాదం ముంది. తాగునీరు సక్రమంగా తాగకపోతే నీరసం, డీహైడ్రేషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. నీడ సౌకర్యం లేకపోవటంతో కూలీలు శారీరకంగా బలహీనమవుతారు. ఈక్రమంలో కూలీలు తగినంత నీరు తాగుతూ.. శరీరం డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలని, పని ప్రవేశాల్లో ఓఆర్ఎస్ ద్రావణం లేదా నిమ్మకాయ నీళ్లుండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, 12 నుంచి 3 గంటల వరకు పనిచేయటం మానుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
ఉపాధి పనులే ఆధారం
జిల్లాలో ప్రస్తుతం కూలీలకు వ్యవసాయ పనులేమి లేవు. దాదాపు అందరూ ఉపాధి పనులపై ఆధారపడుతున్నారు. ఎండల తీవ్రత మూలంగా పనులకు వెళ్లేందుకు పలువురు జంకుతున్నారు. దూరం ఎక్కువగా ఉండటం, నీడ, తాగునీటి వసతి ఏర్పాట్లు చేయకపోతుండటం లాంటి కారణాలతో పనులకు వెళ్తే ప్రాణాలకే ముప్పన్న భావనతో కొందరు కూలీలు దూరంగా ఉంటున్నారు. దీనికి తోడు వంద రోజుల పని దినాలు పూర్తి చేసిన వారు సైతం పనులకు వెళ్లడంలేదు. దీంతో ఉపాధి పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య ఇప్పుడిప్పుడే పెరుగుతూ వస్తోంది. అధికారుల ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామం నుంచి నిత్యం కనీసం 26 మంది కూలీలైన పనులకు రావాలి. రెండు వారాలుగా కూలీల సంఖ్యను పరిశీలిస్తే అంతకంతకు పెరుగుతూ వస్తోంది.
పని ప్రదేశాల్లో కానరాని కనీస సౌకర్యాలు
ప్రథమ చికిత్స కిట్ల జాడ కరువు
జిల్లాలో మొత్తం 1,11,421 జాబ్ కార్డులు