కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోండి అంటూ ప్రకటన ఇచ్చే ముందు క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే సమస్యలపై దృష్టి సారించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వితంతు పింఛన్కు దరఖాస్తు చేసుకునే వారు రేషన్కార్డులో భర్తల పేరు తొలగించుకోవాల్సిందని చెప్పటంతో ఇప్పటికిప్పుడు ఎలా సాధ్యమంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు కొందరు తహసీల్దార్ కార్యాలయం వద్దకు పరుగులు తీస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయానికి ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తహసీల్దార్ డిజిటల్ సంతకం చేసి పంపుతున్నారు. అయితే రేషన్కార్డులో చనిపోయిన వారి పేర్లు డిలీట్ కావడం లేదు. ఈ నేపథ్యంలో దరఖాస్తు గడువులోగా రేషన్కార్డులో పేర్లు తొలగిపోతాయా లేదా అనే సందిగ్ధంలో వితంతువులున్నారు. ఈ విషయమై తహసీల్దార్ చంద్రశేఖర్నాయక్ను వివరణ కోరగా.. సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నందున ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. – జూపాడుబంగ్లా
సార్.. గడువు పొడిగించండి!
08 ఏఎల్ఆర్ 61. పింఛన్కు దరఖాస్తు చేసేందుకు సచివాలయం వద్దకు చేరుకున్న ప్రజలు
కొత్త పింఛన్ల దరఖాస్తుకు గడువు పొడిగించాలని గ్రామీణ ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే రెండు రోజులు గడిచిపోయిందని, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం సమయం సరిపోవడం లేదని, పనులు మానుకుని అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయలేకపోతున్నామని మండల కేంద్రమైన హాలహర్వికి చెందిన పింఛన్ దరఖాస్తుదారులు వాపోతున్నారు. మీ సేవా కేంద్రాలు, సచివాలయాల వద్ద సాంకేతిక సమస్యలతో దరఖాస్తుకు ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఈనెల 16వ తేదీ వరకు ఉన్న గడువును ప్రభుత్వం నెలాఖరు వరకు పొడిగించాలని కోరుతున్నారు.
– హాలహర్వి


