నంద్యాల: జలాధివాసం వీడుతున్న సంగమేశ్వరుడు! | El nino Effect: Sangameswara Temple Emerges Srisailam Water Level | Sakshi
Sakshi News home page

నంద్యాల: జలాధివాసం వీడుతున్న సంగమేశ్వరుడు!

Sep 14 2026 1:22 PM | Updated on Sep 14 2026 1:37 PM

El nino Effect: Sangameswara Temple Emerges Srisailam Water Level

నంద్యాల: వేసవి ఆరంభంలో కనిపించే ఆ దృశ్యం.. ఈసారి వర్షాకాలంలోనే కనిపించింది. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం తగ్గడంతో కృష్ణమ్మ ఒడిలో మునిగిపోయిన సంగమేశ్వర ఆలయం మళ్లీ బయటపడింది. అయితే ఈసారి బయటపడిన వేగమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జలాధివాసమైన ఐదు వారాలకే ఆలయ శిఖరం కనిపించడంతో.. రానున్న రోజుల్లో నీటి లభ్యత ఎలా ఉండబోతోందన్న ఆందోళనలు మొదలయ్యాయి.

శ్రీశైలం జలాశయంలోకి వరద నీరు చేరినప్పుడు సప్త నదుల సంగమంలో కొలువైన ఈ ఆలయం క్రమంగా నీట మునుగుతుంది. సాధారణంగా నీటి మట్టం తగ్గి ఆలయం పూర్తిగా బయటపడటానికి చాలా నెలలు పడుతుంది. ముఖ్యంగా వేసవి ఆరంభంలోనే ఆలయ శిఖరం కనిపించడం ఆనవాయితీ. కానీ ఈసారి ఆగస్టు మొదటి వారంలో జలాధివాసమైన ఆలయ శిఖరం.. కేవలం ఐదు వారాల్లోనే బయటపడిందని ఆలయ అర్చకులు చెబుతున్నారు. 

తగ్గిన ఇన్‌ఫ్లో.. వేగంగా తగ్గిన నీటిమట్టం
సంగమేశ్వర ఆలయం ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది. మిగతా ఎనిమిది నెలలు నీట మునిగి ఉంటుంది. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టానికి అనుగుణంగా కనిపిస్తూ.. మళ్లీ కనుమరుగవుతూ ఉంటుంది. నీటిమట్టం 838 అడుగులకు చేరితే ఆలయంలోకి నీరు ప్రవేశిస్తుంది. 852 అడుగులకు చేరితే సాలాకార మండపం వరకు నీరు వస్తుంది. 865 అడుగులకు చేరితే ఆలయ శిఖరం పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. అందుకే ఆలయ శిఖరం ఎప్పుడు బయటపడిందన్నది శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ పరిస్థితికి ఒక సూచికగా స్థానికులు భావిస్తుంటారు. 

క్లిక్‌ చేయండి: సంగమేశ్వరుడు చేసే ఈ అద్భుతం చూశారా?

అయితే ఈసారి ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో కృష్ణా నదికి వచ్చే వరద ప్రవాహం తగ్గింది. గత నెల రోజులుగా తాగు సాగునీటి కోసం విడుదల చేస్తున్నారు. ఇదే కాకుండా.. ఇంత కష్టకాలంలోనూ జలవిద్యుత్‌ కోసం నీటిని వినియోగించడం విమర్శలకు తావిస్తోంది. అయితే  ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్‌లో 215 టీఎంసీలకు గానూ.. 118 టీఎంసీల నీరు ఉంది. ఈ లెక్కన.. నీటి మట్టం తగ్గడంతో మరో 15 నుంచి 20 రోజుల్లో ఆలయం పూర్తిగా బయటపడే అవకాశం ఉంది.

గతంలో నెలల తరబడి నీటిలోనే..
సంగమేశ్వర ఆలయం మునగడం, బయటపడటం కొత్తేమీ కాదు. గతంలోనూ శ్రీశైలం జలాశయం నిండిన సమయంలో ఆలయం నీటిలో మునిగిపోయింది. నీటిమట్టం తగ్గిన తర్వాత మళ్లీ బయటపడింది. అయితే సాధారణంగా ఈ ప్రక్రియకు నెలల సమయం పడుతుంది. అందుకే ఈసారి కేవలం ఐదు వారాల్లోనే శిఖరం బయటపడటం ప్రత్యేకంగా నిలిచింది. గత ఏడాది కూడా ఆలయం సుదీర్ఘకాలం నీటిలోనే ఉండి.. నీటిమట్టం తగ్గిన తర్వాత బయటపడింది. ఈ నేపథ్యంలో ఈసారి ఇంత త్వరగా బయటపడటంపై స్థానికంగా చర్చ జరుగుతోంది.

ఎల్‌ నినో ప్రభావమేనా?
వాతావరణ మార్పుల నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. వర్షాలు లేకపోయినా.. ఎగువన వరదతో ఆలయం నీట మునగడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి ఎల్‌ నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షపాతం, కృష్ణా నదికి వచ్చిన ఇన్‌ఫ్లో, శ్రీశైలం జలాశయం నుంచి నీటి విడుదల, సాగు–విద్యుత్‌ అవసరాలు.. ఇలా అనేక అంశాలు జలాశయంలో నీటిమట్టాన్ని ప్రభావితం చేశాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణ సమయంతో పోలిస్తే ఇంత త్వరగా ఆలయం బయటపడటం మాత్రం నీటి పరిస్థితిపై ముందస్తు హెచ్చరికలా చూడాల్సిన అవసరం ఉందనే చర్చ జోరందుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement