హరా... నిర్లక్ష్యం కనరా
వంగర: ద్వాపర కాలం నాటి ఆలయం, సాక్షాత్తు బలరాముడు ప్రతిష్టించిన శివలింగం, పవిత్ర నాగావళి దివ్య క్షేత్రం. ఇన్ని గొప్ప లక్షణాలున్నా ఆ ఆలయం మాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఆలయ ఆలనా పాలనా చూడాల్సిన దేవాదాయ శాఖ అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో సమస్యలు రాజ్యమేలుతున్నాయి.
– ఆలయం ప్రాంగణం పిచ్చిమొక్కలతో అధ్వానంగా ఉండగా, ప్రహరీ లోపలి భాగంలో కళావిహీనంగా మారింది.
– గుడిగోపురం పిచ్చిమొక్కలతో నిండి ఉన్నా ఇంత వరకు తొలగించలేదు.
– తాగునీటి కుళాయి పిచ్చిమొక్కల మధ్య ఉండిపోయింది.
– ఆలయంలోని పోలీస్ షెల్టర్ గది పూర్తిగా కూలిపోయింది. అయినా ఎవరూ పట్టించుకోలేదు.
– 400 ఏళ్ల నాటి భారీ మర్రి వృక్షం ప్రత్యేక ఆకర్షణ. అలహాబాద్ పరిధి త్రివేణి సంగమం తర్వాత మూడు నదులు కలిసే(నాగావళి,సువర్ణముఖి,వేగావతి) ప్రదేశం ఇక్కడ ఉంది. ఇది త్రివేణి సంగమంగా కీర్తిస్తారు. త్రివేణి సంగమం వైపు భక్తులు వెళ్లాలంటే రెల్లిపొదల్లోంచి నడిచి వెళ్లాల్సిన దుస్థితి.
– ఇలాంటి ప్రతిష్టాత్మకమైన దేవాలయంపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, అభివృద్ధి కనీసం చేయలేదని, సమస్యలు పరిష్కరించలేదని ఇక్కడకు వచ్చిన భక్తులు మండిపడుతున్నారు.