● 87 టీఎంసీలకు పడిపోయిన నీటి నిల్వ
హొళగుంద: కర్ణాటక రాష్ట్రం హొస్పేట్ వద్ద నిర్మించిన తుంగభద్ర జలాశయానికి శుక్రవారం ఉదయం ఇన్ఫ్లో పూర్తిగా నిలిచిపోయింది. డ్యాం ఎగువ భాగంలోని ఆగుంబే, శృంగేరి, తీర్థనహళ్లీ, చిక్మంగళూరు, కొడుగు, వరనాడు, శివమొగ్గ, కొప్పి తదితర ప్రాంతాల్లో వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. దీంతో డ్యామ్కు ఇన్ఫ్లో గత కొద్ది రోజులుగా క్రమేణా తగ్గుతూ శుక్రవారం నాటికి జీరోగా నమోదైంది. ఇక 9,993 క్యూసెక్కులను డ్యాం నుంచి వివిధ కాలువలకు (ఔట్ఫ్లో) వదులుతున్నారు. డ్యాం పూర్తి సామర్థ్యం 1633 అడుగులతో 105.788 టీఎంసీలు కాగా శుక్రవారం ఉదయానికి 1628 అడుగుల వద్ద 87 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్ఫ్లో తగ్గడంతో డ్యాంలో నీటి నిల్వ వేగంగా తగ్గుతూ వస్తుందని బోర్డు అధికారులు తెలిపారు. కొద్ది రోజులుగా ఎండలు, నీటి వాడుక పెరగడంతో రోజుకు ఒక టీఎంసీ చొప్పున నీరు డ్యాంలో ఖాళీ అవుతుంది. కాగా గత రెండేళ్లుగా రైతులు ఎల్లెల్సీ కింద పూర్థిస్థాయిలో పంటలు సాగు చేసుకోలేక పోతున్నారు. గతేడాది గేట్లు అమర్చే కారణంతో ఒక పంటకు మాత్రమే నోచుకోగా ఈ ఏడాది ఎల్నినో (వర్షాభావ) పరిస్థితి కారణంగా సాగునీటికే కాదు.. తాగునీటికి కూడా కష్టంగా మారే పరిస్థితి నెలకొంది. వర్షాకాలం ప్రభావం ఇంకా ఉన్నా ఎండాకాలాన్ని తలపిస్తున్న ఈ పరిస్థితిని తలుచుకుని వచ్చే ఎండాకాలంలో ఇంకా ఎలాంటి దారుణ పరిస్థితు లు ఏర్పడుతాయోనని అటు అధికారులు, ఇటు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.


