● సాగునీరు అందించడం సాధ్యం కాదు
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల(న్యూటౌన్): తాగునీటి అవసరాల కోసం విడుదల చేసిన నీటిని అనధికారికంగా మళ్లిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాజకుమారి హెచ్చరించారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో సాగునీరు అందించడం సాధ్యం కాదని, రైతులకు కఠినంగా కాకుండా మర్యాదపూర్వకంగా వివరించాలని అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో సోమవారం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం నేపథ్యంలో ప్రజలకు తాగునీటి కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో 14 లక్షల పశుసంపద ఉన్నందున ప్రజలతో పాటు పశువుల తాగునీటి అవసరాలను తీర్చాలన్నాపరు. కేసీ కెనాల్, కొలిమిగుండ్ల బ్రాంచ్ కెనాల్, ఎస్ఆర్బీసీ కాలువల ద్వారా విడుదలైన నీటిలో ఒక్క నీటి బొట్టు కూడా వృథా కాకూడదన్నారు. ప్రతి కుంట, చెరువు, 13 ఎస్ఎస్ ట్యాంకులను నింపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకు రెవెన్యూ, నీటిపారుదల, పంచాయతీరాజ్, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు.


