గోస్పాడు: జిల్లెల్ల గ్రామానికి చెందిన తెలుగు వెంకటరాముడు (56) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు సూసైడ్ లేఖలో పేర్కొన్న వివరాల మేరకు.. గ్రామంలోని గంగమ్మ గుడికి సంబంధించిన లెక్కలు చూస్తుండేవాడు. అయితే గుడికి సంబంధించిన డబ్బులు వెంకట రాముడు వాడుకుంటున్నాడని ఆరోపణలు రావడంతో కుల పంచాయితీలో లెక్కలు చూపించి మొత్తం తన కుల సంఘానికి అప్పగించాడు. అయినా కూడా తప్పుడు లెక్కలు రాసి డబ్బులు దోచుకున్నాడని కొంతమంది అవమానించడంతో మనస్తాపం చెందాడు. ఈ మేరకు మంగళవారం అర్ధరాత్రి సమయంలో వెంకట రాముడు కేసీ కెనాల్ సమీపంలో కానుగ చెట్టుకు ఉరేసుకుని మృతి చెందాడు. తన చావుకు గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి, నారాయణరెడ్డి, మల్లికార్జునరెడ్డి, శేఖర్రెడ్డి, పుల్లయ్య, టోపీ రాజు, చిన్న ఓబులేసు కారణమని సూసైడ్ నోట్ రాశాడు. మృతుని కుమారుడు హరికృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గోస్పాడు ఎస్ఐ సుధాకర్ రెడ్డి తెలిపారు.
అంగన్వాడీల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
నంద్యాల(అర్బన్): అంగన్వాడీల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐసీడీఎస్ పీడీ లీలావతిదేవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మూడు మెయిన్ అంగన్వాడీ కార్యకర్తల, 52 అంగన్వాడీ ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. అంగన్వాడీ కార్యకర్త పోస్టుకు అభ్యర్థినులు 01–07–2026 నాటికి 21 సంవత్సరాలు వయస్సు నిండి 35ఏళ్ల లోపు వారై ఉండాలని తెలిపారు. వివాహితులై స్థానిక నివాసితురాలై ఉండాలని, ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో 21 సంవత్సరాల వయస్సు నిండిన వారు లేకపోతే 18 ఏళ్లలోపు వారిని పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. అభ్యర్థినులు తప్పని సరిగా పదో తరగతి పాస్ అయి ఉండాలన్నారు. ఆయా పోస్టుకు పదో తరగతి పాస్ అయి 01–07–2026 నాటికి 21 సంవత్సరాలు నిండి 35ఏళ్లలోపు వారై ఉండాలన్నారు. పుట్టిన తేదీ, కులధ్రువీకరణ పత్రం, విద్యార్హత ధ్రువీకరణ పత్రం, నివాస స్థల ధ్రువీకరణ పత్రం, వితంతువు అయినచో భర్త మరణ పత్రం, దివ్యాంగురాలు అయితే వికలత్వ సర్టిఫికెట్, వితంతువు అయితే ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్తో జతపరిచి ఈనెల 5 నుంచి 18లోగా సంబంధిత సీడీపీఓ కార్యాలయంలో అందజేయాలన్నారు.
డ్రంకెన్ డ్రైవ్ చేసిన
నలుగురికి జైలు
డోన్ టౌన్: మద్యం తాగి వాహనాలు నడిపిన నలుగురు వ్యక్తులకు జడ్జి నూరుల్లా జైలు శిక్ష లు విధించినట్లు సీఐ ఇంతియాజ్బాషా తెలిపారు. పట్టణంలోని కొండపేటకు చెందిన చాక లి తిరుమలేసుకు నాలుగు రోజులు, కోట్ల విజయభాస్కర్రెడ్డి నగర్కు చెందిన నీలకంఠ, కొండపేటకు చెందిన ఈడిగ వెంకటేశ్వర్లు, డోన్ మండలం తాడూరు గ్రామానికి చెందిన దస్తగిరికి రెండు రోజుల పాటు జైలు శిక్ష విధించిన ట్లు సీఐ చెప్పారు. మద్యం తాగి వాహనాలు నడిపితే వారి ప్రాణాలతో పాటు అమాయక ప్రజల ప్రాణాలకు హాని కలుగుతుందని అన్నారు.
పేకాట రాయుళ్ల అరెస్ట్
చిప్పగిరి: ఖాజీపురం కొట్టాల శివారు ప్రాంతంలో పేకాట ఆడుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ సీవీ నరసిహులు తెలిపిన వివరాల మేరకు.. గుట్టుగా పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్ఐ బుధవారం మధ్యాహ్నం సిబ్బందితో వెళ్లి దాడి చేశారు. పేకాట రాయుళ్లలో ఆరుగురు వ్యక్తులు, ఓ మహిళ ఉన్నారు. వారి వద్ద నుంచి రూ 32,250 నగదు, నాలుగు ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.


