పాణ్యం: వైఎస్సార్సీపీ చేసిన పోరాటానికి కూటమి ప్రభుత్వం దిగి రావడంతో తాగునీటి అవసరాల నిమిత్తం గోరుకల్లు నుంచి ఎస్సార్బీసీకి 500 క్యూసెక్కుల నీటిని అధికారులు శనివారం విడుదల చేశారు. ఎస్సార్బీసీకి నీటిని విడుదల చేయాలని ఈనెల 18వ తేదీన వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ఆధ్వర్యంలో గోరుకల్లు జలాశయ సందర్శనకు రైతులతో కలసి వెళ్లారు. అయితే గోరుకల్లు జలాశయాన్ని చూసేందుకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, అవుకు జలాశయం, రాయలసీమ ప్రాజెక్టుల సందర్శనపై టాస్క్ఫోర్స్ బృందం ద్వారా ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ ఒత్తిడి తీసుకొచ్చింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ చేసిన పోరాటానికి ఎస్సార్బీసీ పరిధిలో ఉన్న గ్రామాలకు తాగునీటి అవసరాల నిమిత్తం 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎస్సార్బీసీకి నీటిని విడుదల చేయడంతో పాణ్యం, బనగానపల్లె, అవుకు, కోవెలకుంట్ల, సంజామల, తదితర మండలాలకు తాగునీటి సమస్య తీరనుంది. కాగా నీటి విడుదలను మరింత పెంచేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వైఎస్సార్సీపీ నాయకులు సమాయత్తమవుతున్నారు.


