శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానం ఇటీవల దేవస్థాన వెబ్సైట్లో ప్రోటోకాల్ మాడ్యూల్లో మార్పులు చేసి ఈ నెల 15వ తేదీ నుంచి ఆ మేరకు దర్శనాలకు శ్రీకారం చుట్టారు. అయితే ఆదిలోనే హంసపాదు అన్నట్లు ప్రోటోకాల్ మాడ్యూల్తో అవస్థలు తప్పడం లేదు. శ్రీశైలం భ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్ల దర్శనానికి విచ్చేసే వీవీఐపీ, వీఐపీలు, సిఫార్స్ లేఖలతో దర్శనాలకు వచ్చే వారు 48 గంటల ముందు లెటర్ పంపాలని దేవస్థానం సూచించింది. టీటీడీ తరహాలో ఆన్లైన్ ద్వారానే మల్లన్న స్పర్శదర్శనం టికెట్ల లింక్ భక్తుల మొబైల్కు వెళ్లేలా ఏర్పాట్లు చేశామని, భక్తులే నేరుగా వారి మొబైల్ ఫోన్ నుంచి యూపీఐ ద్వారా ఆన్లైన్లో పేమెంట్ చేసి, టికెట్లను ప్రింట్ తీసుకుని దర్శనానికి రావాలని దేవస్థానం సూచించింది. అయితే ప్రోటోకాల్ మాడ్యూల్ సరిగ్గా పనిచేయకపోవడంతో భక్తులు అవస్థలు పడుతున్నారు. రెండు రోజుల క్రితం 35 వీఐపీ లెటర్లు వస్తే అందులో 30 లేఖలకు పేమెంట్ అవ్వలేదని సమాచారం. అలాగే ఆదివారం 15 లేఖలను అప్లోడ్ చేస్తే అందులో ఒక్కటి మాత్రమే పేమెంట్ కాగా.. మిగిలిన 14 లేఖలకు పేమెంట్ మోడ్ రాలేదని సమాచారం. సోమవారం కూడా పలువురు వీఐపీల నుంచి వచ్చిన సిఫార్స్ లేఖలను వెబ్సైట్లో కాల్ సెంటర్ సిబ్బంది అప్లోడ్ చేసినప్పటికీ భక్తులకు టికెట్ల లింక్ వెళ్లకపోవడం గమనార్హం. లింక్ పోయిన వారికి పేమెంట్ మోడ్ రావడం లేదు. లింక్ పోయి, పేమెంట్మోడ్ వచ్చిన వారికి కూడా టికెట్లలో దర్శన తేదీ, దర్శన సమయం కనిపించడం లేదు. దీంతో వారికి గతంలో మాదిరిగానే కౌంటర్ల వద్దకు పిలిపించుకుని మాన్యువల్ టికెట్లను అందిస్తున్నారు. పూర్తిస్థాయిలో ప్రోటోకాల్ మాడ్యూల్ను సిద్ధం చేసిన తరువాత భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని, అలా కాకుండా భక్తులను ఇబ్బంది పెట్టడం తగదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలాఉంటే గతంలో దేవస్థానానికి ఉచితంగా వెబ్సైట్ చేస్తామని ముందుకొచ్చిన 9 అండ్ 9 సాఫ్ట్వేర్ కంపెనీని తొలగించి.. గతంలో సాఫ్ట్వేర్ను అడ్డంపెట్టుకుని అవినీతికి పాల్పడిన ఏపీటీఎస్ టీఎంఎస్ సాఫ్ట్వేర్కు అప్పగించడం విమర్శలకు తావిస్తోంది.
పూర్తిగా సిద్ధం కాని
ప్రోటోకాల్ మాడ్యూల్
భక్తులకు చేరని టికెట్ల లింక్, వెళ్లినా..
పేమెంట్లో జాప్యం
టికెట్లపై కనిపించని దర్శన సమయం


