● స్వాతంత్య్ర వేడుకలకు
నంద్యాల ముస్తాబు
నంద్యాల(అర్బన్): స్వాతంత్య్ర సంబరాలకు జిల్లా కేంద్రమైన నంద్యాల ముస్తాబైంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉత్సవాలకు రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, ప్రజలు హాజరు కానున్నారు. వీరందరూ కూర్చొని వేడుకలు తిలకించేందుకు గ్యాలరీలు ఏర్పాటు చేశారు. డిగ్రీ కళాశాల ప్రాంగణంలో, గ్యాలరీల వద్ద తాగునీరు, అల్పాహారం అందించనున్నారు. మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేశారు. వేడుకల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన శకటాలను ప్రదర్శించనున్నారు. ఏర్పాట్లను కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్షెరాన్ శుక్రవారం పరిశీలించారు. జాతీయ పతాక ఆవిష్కరణ మొదలుకొని వేదిక బ్యాక్ డ్రాప్ పోలీసు సాయుధ దళాల మార్చ్ఫాస్ట్, బ్యారికేడింగ్, స్టేజి నిర్మాణం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్ల పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ విశ్వనాథ్, డీఆర్ఓ రామునాయక్ తదితరులు ఉన్నారు.


