కర్నూలు: తపాలా శాఖ ద్వారా అందుబాటులో ఉన్న పోస్టల్ సేవింగ్స్, పెట్టుబడి, బీమా పథకాలు, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ తదితర పథకాల గురించి ఉద్యోగులకు అవగాహన కల్పించారు. పోస్టల్ శాఖ కర్నూలు డివిజన్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక న్యాయ సేవా సదన్లో న్యాయ అవగాహన కార్యక్రమంతో పాటు ప్రత్యేక ఆధార్ క్యాంప్ నిర్వహించారు. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర అర్హత కలిగిన వర్గాలకు అందించే బీమా సౌకర్యాలు, పాలసీల ప్రత్యేకతలు, కుటుంబానికి కలిగే ఆర్థిక భద్రత, భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
ఆధార్ క్యాంప్
జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి ఆదేశాల మేరకు న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి ఆధ్వర్యంలో ఆధార్ నమోదు, నవీకరణ సేవలు ప్రత్యేక ఆధార్ క్యాంప్ ద్వారా అందించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా లీలా వెంకటశేషాద్రి పేర్కొన్నారు. కర్నూలు శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకటహరినాథ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రుడు, కర్నూలు పోస్టల్ సూపరింటెండెంట్ జనార్ధన్ రెడ్డి, హెడ్ క్వార్టర్స్లోని న్యాయాధికారులు, న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు.


