మహానంది: మహానంది క్షేత్రంలో భక్తుల సందడి కొనసాగుతోంది. పరమేశ్వరుడికి ప్రీతికరమైన సోమవారం, ఆరుద్ర నక్షత్రం కలిసి రావడంతో వేలాది మంది భక్తులు ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా భక్తులు స్థానిక కోనేరుల్లో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ కామేశ్వరీదేవి సహిత శ్రీ మహానందీశ్వరస్వామి వార్లతో పాటు కోదండరామాలయం, ఆంజనేయస్వామి, వినాయకనంది, గరుడనంది క్షేత్రాలను సందర్శించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఉదయం కల్యాణ మండపంలో స్వామి, అమ్మవారికి కల్యాణం, రాత్రి యాగశాలలో ఏకాంత సేవ పూజలు చేశారు. మహానంది, నంద్యాల, శిరివెళ్ల తదితర మండలానికి చెందిన హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు వేకువజామున ఆలయ మాడవీధుల్లో శివనామస్మరణ చేస్తూ ప్రదక్షిణ చేసి పూజలు చేపట్టారు. ప్రతి సోమవారం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఆధ్యాత్మికత భావాన్ని పెంపొందిస్తున్నారు. గాజులపల్లె రైల్వేస్టేషన్ గ్రామంలో వెలిసిన శ్రీ గంగ, గౌరీ సమేత మరకతలింగేశ్వరస్వామి, నవగ్రహ దేవాలయాల్లో వెలిసిన మరకతలింగేశ్వర స్వామి సన్నిధిలో లయ వ్యవస్థాపకులు కనమర్లపూడి మస్తాన్రావు ఆధ్వర్యంలో సోమవారం ఆరుద్ర నక్షత్రోత్సవం పూజలు వైభవంగా చేపట్టారు.


