కర్నూలు(సెంట్రల్): ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ఆలూరు ఎమ్మెల్యే బి.విరుపాక్షిపై పెట్టిన అక్రమ కేసును వెంటనే రద్దు చేయాలని బోయ వాల్మీకి సమితి డిమాండ్ చేసింది. సోమవారం ఆ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు వాల్మీకి నాయుడు, కప్పట్రాళ్ల రాజశేఖర్, సర్పంచ్ల సంఘం మాజీ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్, వాల్మీకి రైతు సంఘం నాయకులు కృష్ణ, మద్దిలేటి మాట్లాడుతూ.. చిప్పగిరి మండలం సంగాలలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో ఆ గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి తన భార్య దుస్తులను చింపిన వైనాన్ని చూసి చెప్పవచ్చన్నారు. కేవలం ఎమ్మెల్యేపై కేసు పెట్టడం కోసం భార్య బట్టలు చింపిన నాగరాజు.. ఎంతటి దుర్మార్గంగా ప్రవర్తించాడో బయటకు వచ్చిన వీడియోనే సాక్ష్యమన్నారు. మహిళను అవమానించిన నాగరాజుపై పోలీసులు కేసు పెట్టకుండా బోయ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేపై కేసు పెట్టడం అన్యాయమన్నారు. మరోవైపు గ్రామాల్లో ఎస్సీలు, బోయలు/వాల్మీకుల మధ్య చిచ్చు పెట్టడమే లక్ష్యంగా సంగాలలో పావులు కదిపారని చెప్పారు. నాయకులు తిరుమలేష్, మోహన్, హేమంత్ పాల్గొన్నారు.


