ఆళ్లగడ్డ: అహోబిలం చేరుకునే భక్తులను టోల్గేట్ నిర్వాహకులు దోచుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. అహోబిలం బ్రహ్మోత్సవాలకు అత్యధికంగా పేదలు, మధ్యతరగతి వర్గాల కు చెందిన భక్తులు వస్తారన్నారు. కుటుంబంతో వచ్చే సమయంలో కారు, ఆటోలను అద్దెకు తెచ్చుకుంటారన్నారు. వారి నుంచి ఒక్కో వాహనానికి రూ. 200 వసూలు చేయడం ఏంటని మండి పడ్డారు. టోల్గేట్ వసూలు చేసే దగ్గర ఏ వాహనానికి ఎంత అన్న బోర్డును అధికారులు ఎందుకు పెట్టలేక పోతున్నారని నిలదీశారు. గతంలో టోల్గేట్ వేలం పాటల్లో పోటీ లు పడి పాట ఎక్కువగా పోతే భక్తుల నుంచి వసూళ్లు ఎక్కువగా చేయాల్సి వస్తుందని అప్పటి పోలీసు, పంచాయతీ అధికారుల ద్వారా రాజీ చేయించి తక్కువ పాటకు దక్కేలా చేశామన్నారు. భారీ వాహనానికి రూ.100 వసూలు చేస్తున్నారని ఇప్పటి ఎమ్మెల్యే అప్పుడు ఆ చీటి పట్టుకుని నానా రభస చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అధికారులు నిర్ణయించిన ధరల ప్రకారం ఆటోకు రూ. 75, కారుకు రూ. 100 మాత్రమే వసూలు చేయాలని, ఇష్టారాజ్యంగా వసూలు చేస్తే కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామన్నారు.


