● అంబరాన్నంటిన అహోబిలేశుడి రథోత్సవం ● గోవింద నామస్మరణతో మార్మోగిన నల్లమల ● ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
ఆళ్లగడ్డ: అహోబిల క్షేత్రంలో ప్రహ్లాదవరదుడు ఉభయ దేవేరులతో కలసి రథంపై కొలువై భక్తులకు అభయమిచ్చారు. సకల దేవతారాధకుడైన స్వామివారు దాంపత్య శోభతో రథాన్ని అధిష్టించి అహోబిలం క్షేత్రం తిరువీధుల్లో విహరించారు. వేద పండితుల మంత్రాచ్ఛారణలు.. ఆస్థాన విద్వాంసుల మంగళవాయిద్యాలు.. భక్తజన గోవిందా నామస్మరణతో నల్లమల గిరులు మారుమోగాయి. అహోబిలేశుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా దిగువ అహోబిల క్షేత్రంలో మంగళవారం ప్రహ్లాదవరదస్వామి రథోత్సవం కనుల పండువగా సాగింది. ముందుగా ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించి పట్టు పీతాంబరాలతో ఆదిదంపతులుగా ముస్తాబు చేసి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను రథం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అప్పటికే వివిధ రకాల పుష్పాలతో ముస్తాబు చేసిన రథంపై స్వామి, అమ్మవార్లను ఉంచి పూజలు చేశారు. అహోబిల మఠం పీఠాధిపతి రంగనాథ యతీంద్ర మహాదేశికన్ శాస్త్రోక్తంగా రథాంగ పూజలు నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించారు. రథం ముందు భక్తి పారవశ్యంతో కళాకారులు, భక్తుల కోలాటాలు, హరి భజనలు, డప్పుల వాయిద్యాలు, ఢమరుక నాధాలు, కళాకారుల వేషధారణలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రహ్లాదవరదుడు రథంపై నుంచి భక్తులను అనుగ్రహిస్తూ క్షేత్ర మాడవీధుల్లో విహరించారు. స్వామి వారిని దర్శించుకున్న భక్తజనం గోవిందా.. గోవింద అంటూ మొక్కులు చెల్లించుకున్నారు.


