భక్తులకు ఇబ్బంది లేకుండా వీధి కుక్కల నియంత్రణ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైలంలో భక్తులకు, స్థానికులకు ఇబ్బందులు లేకుండా కోతులు, వీధికుక్కల నియంత్రణ చేపడుతున్నట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. దేవస్థాన పరిపాలన భవనంలోని సమీక్షా సమావేశ మందిరంలో బుధవారం సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఈఓ మాట్లాడుతూ.. కోతుల బెడద లేకుండా ఉండేందుకు మోషన్–సెన్సార్ డిటరెంట్స్ టెక్నాలజీ (శబ్దాలు వచ్చే స్పీకర్లు) వినియోగించుకోవచ్చునన్నారు. ఇవి కోతులను భయపెట్టి దూరంగా ఉంచుతాయన్నారు. సమావేశంలో ఏపీ రాష్ట్ర వెటర్నరీ కౌన్సిల్ ప్రెసిడెంట్ లక్ష్మయ్య, వెటర్నరీ కౌన్సిల్ రిజిస్టార్ ఈశ్వరరావు, శ్రీవెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డా.జె.వి.రమణ పాల్గొన్నారు.
అన్నప్రసాద వితరణకు
రూ.3 లక్షల విరాళాలు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ పథకానికి పలువురు భక్తులు రూ.3లక్షల విరాళాలను అందించారు. బుధవారం విశాఖపట్నంకు చెందిన ఎన్.రామకృష్ణన్ రూ.లక్ష విరాళాన్ని ఏఈవో శ్రీనివాసులరెడ్డికి అందించారు. అలాగే కర్నూలుకు చెందిన ఎ.సుధేష్ణరాణి రూ.లక్ష విరాళాన్ని ఏఈవో సతీష్కు, గుంటూరుకు చెందిన చెరుకూరి సాయి వెంకట్ రూ.1,00,116 విరాళాన్ని పర్యవేక్షకులు కె.శివప్రసాద్కు అందజేశారు. విరాళాలు అందించిన దాతలకు దేవస్థాన అధికారులు స్వామివారి శేషవస్త్రాలను, లడ్డూ ప్రసాదాలను, జ్ఞాపికలను అందించి సత్కరించారు.
ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
నంద్యాల(వ్యవసాయం): విద్యార్థులు వినియోగదారుల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ కార్తీక్ సూచించారు. జాతీయ వినియోగదారుల వారోత్సవాలు ముగింపు వేడుకలు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించారు. జిల్లా వినియోగదారుల సంఘం అధ్యక్షుడు అమీర్బాషా అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే డిజిటల్ పాలన, ఈ ఫైలింగ్పై అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం వక్తృత్వ వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. డీఎంహెచ్ఓ వెంకటరమణ, ఫుడ్ సేఫ్టీ అధికారి వెంకటరాముడు, లీగల్ మెట్రాలజీ అధికారి జిలానీ బాషా, డీఈఓ జనార్దన్రెడ్డి, పౌర సరఫరాల శాఖ అధికారి రవిబాబు, డీటీఓ శివారెడ్డి పాల్గొన్నారు.
ఆర్యూకు ఫోర్ స్టార్ రేటింగ్
కర్నూలు (కల్చరల్): ఆంధ్రప్రదే, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ–గవర్నెన్స్ సర్టిఫికేషన్తో పాటు ఐఎస్ఓ సర్టిఫికేషన్లో రాయలసీమ యూనివర్సిటీ 4 స్టార్ రేటింగ్ సాధించడంపై వర్సిటీ వైస్ చాన్స్లర్ ఆచార్య వి.వెంకట బసవరావు హర్షం వ్యక్తం చేశారు. ఐఎస్ఓ సర్టిఫికేషన్ సంస్థ హైమ్ సర్టిఫికేషన్ సంస్థ ప్రతినిధులు బుధవారం వర్సిటీ వీసీకి ఏడు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా వర్సిటీకి సహకరించిన హైమ్ సర్టిఫికేషన్ ప్రతినిధి ఎ.శివయ్య బృందానికి ఆచార్య వెంకట బసవరావు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ఆచార్య ఎన్టీకే నాయక్, రిజిస్ట్రార్ డాక్టర్ బి.విజయకుమార్ నాయుడు, వర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య సి.విశ్వనాథ రెడ్డి, ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య పీవీ సుందరానంద్, డీన్ ఆఫ్ అకడమిక్ అఫైర్స్ ఆచార్య సీవీ కృష్ణారెడ్డి, ఐక్యూఏసీ డైరెక్టర్ ఆచార్య ఆర్.భరత్ కుమార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
భక్తులకు ఇబ్బంది లేకుండా వీధి కుక్కల నియంత్రణ
భక్తులకు ఇబ్బంది లేకుండా వీధి కుక్కల నియంత్రణ


