నల్లగొండ : నాగార్జునసాగర్ నుంచి సాగర్ ఎడమ కాలువకు తక్షణమే నీటిని విడుదల చేసి, దాని పరిధిలోని రిజర్వాయర్లు, చెరువులు, కుంటలను నింపాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండలోని సీపీఐ(ఎం) దొడ్డి కొమరయ్య భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో తీవ్రమైన ఎండల కారణంగా అనేక నీటి వనరులు ఎండిపోయాయని, వర్షాలు కురుస్తాయనే ఆశతో రైతులు బోర్ల ఆధారంగా వరి, మెట్ట పంటలు సాగు చేశారని తెలిపారు. ప్రస్తుతం నీటి కొరత కారణంగా పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్లో 534 అడుగుల వరకు నీరు ఉందని, 34,438 క్యూసెక్కుల వరద నీరు వస్తున్న నేపథ్యంలో సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయడానికి ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)పై కూడా ఒత్తిడి తేవాలన్నారు. ప్రాజెక్టులు పూర్తిగా నిండిన తర్వాతే దిగువకు నీటిని విడుదల చేస్తామనే విధానం కాకుండా, ప్రస్తుతం వస్తున్న నీటిని దామాషా పద్ధతిలో వినియోగించుకునేలా నిర్ణయం తీసుకోవాలన్నారు. కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, నాయకులు ముదిరెడ్డి సుధాకర్రెడ్డి నారి ఐలయ్య, బండా శ్రీశైలం, పాలడుగు నాగార్జున, ప్రభావతి, సయ్యద్ హాషం, వీరేపల్లి వెంకటేశ్వర్లు, చినపాక లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి


