నిబంధనల ప్రకారమే నిర్వహిస్తున్నాం..
నల్లగొండ టౌన్ : నిబంధనలకు విరుద్దంగా నడుపుతున్న నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఐకాన్ ఆస్పత్రికి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ ఆస్పత్రిలో రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, రోగి చనిపోయే దశలో పక్కనే ఉన్న ప్రభుత్వ జనరల్ ఆప్పత్రికి తరలిస్తున్నారని అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో మంగళవారం రాత్రి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఐకాన్ ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో అక్కడ రోగుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఐకాన్ ఆసుపత్రిలో ఫీజులను అధికంగా వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని తనిఖీలు నిర్వహించినట్లు డీఎంహెచ్ఓ కె.రాహుల్ తెలిపారు. మూడేళ్ల కాలంలో ఈ ఆస్పత్రిలో191 మరణాలు సంభవించినట్లు ఫిర్యాదులు రావడంతో వారికి సంబంధించిన కేస్ షీట్లను, రికార్డులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అదే విధంగా ఆసుపత్రి అనుమతి సమయంలో పేర్కొన్న వైద్యులు గాకుండా ఇతర వైద్యులు ఉన్నారని.. వారి వివరాలను వైద్య ఆరోగ్యశాఖకు తెలియజేయలేనది పేర్కొన్నారు. ఆస్పత్రి రికార్డులను స్వాధీనం చేసుకున్నామని.. పూర్తి విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాము నిబంధనల ప్రకారమే ఆసుపత్రి నిర్వహిస్తున్నామని నిబంధనలకు విరుద్దంగా ఎక్కడ వ్యవహరించడం లేదు. అధిక ఫీజులు వసూలు చేయడం లేదని, కావాలని కొందరు తమపై దుష్ప్రచారం చేస్తున్నారు.
– డాక్టర్ ప్రదీప్, ఐకాన్ ఆసుపత్రి డైరెక్టర్


