సంఖ్యాపరంగా మూడో స్థానంలో నల్లగొండ
జిల్లాలో ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ను వేగంగా చేస్తున్నాం. వీలైనంత ఎక్కువగా చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. 78.11 శాతం రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉన్నాయి. కలెక్టర్ బి.చంద్రశేఖర్ నేతృత్వంలో దానిని 92 శాతం చేరుకోవాలన్న లక్ష్యంతో పని చేస్తున్నాం. – శ్రీనివాస్, అదనపు కలెక్టర్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సమరణ (సర్) ఎన్యుమరేషన్ ఫారాల డిజిలైజేషన్ (ఆన్లైన్లో నమోదు)లో రాష్ట్రంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో నల్లగొండ జిల్లా నిలిచింది. గురువారం వరకు జరిగిన డిజిటైజేషన్ లెక్కలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీలోనూ మిగితా జిల్లాల కంటే నల్లగొండ జిల్లా ముందుగా పంపిణీని పూర్తి చేసి మొదటి స్థానంలో నిలువగా, ఇప్పుడు డిజిటలైజేషన్లోనూ ఉమ్మడి జిల్లాకే చెందిన యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాలు నిలిచి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పని తీరును కనబరిచాయి. మరోవైపు ప్రజలు, రాజకీయ పార్టీల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, పలు జిల్లాల్లో ఎన్యుమరేపన్ ఫారాలు తిరిగి రాకపోవడంతో ఎన్నికల కమిషన్ ఎన్యుమరేషన్ గడువును పొడగించింది. దీంతో నల్లగొండలో 92 శాతం ఫారాల డిజిటలైజేషన్ను లక్ష్యంగా యంత్రాంగం ముందుకు సాగుతోంది.
85.18 శాతంతో మొదటి స్థానంలో యాదాద్రి
సర్ ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్లో 85.18 శాతంతో యాదాద్రి భువనగిరి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 78.11 శాతంతో నల్లగొండ రెండో స్థానంలో నిలువగా, 78.09 శాతంతో సిద్ధిపేట జిల్లా మూడో స్థానంలో నిలిచింది. యాదాద్రి జిల్లాలో 4,59,943 మంది ఓటర్లు ఉండగా, వారందరికీ ఎన్యుమరేషన్ ఫారాలను అందజేశారు. వాటిల్లో 3,91,773 పూర్తి చేసిన ఫారాలను తిరిగి తెప్పించుకొని డిజిటలైజేషన్ చేశారు. నల్లగొండ జిల్లాలో 15,16,253 ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేయగా 11,84,302 మంది నుంచి పూర్తి చేసిన ఫారాలను తెప్పించుకొని డిజిటలైజ్ చేశారు. ఇక సూర్యాపేట జిల్లాలో 10,08,252 మంది ఓటర్లు ఉండగా వారందరికీ ఫారాలను పంపిణీ చేశారు. అందులో 6,74,688 మంది నుంచి పూర్తి చేసిన ఫారాలను తిరిగి తెప్పించుకొని డిజటలైజేషన్ పూర్తి చేసి 12వ స్థానంలో నిలిచింది. అలాగే 7,75,369 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలను (78.09 శాతం) డిజటలైజ్ చేసి సిద్ధిపేట జిల్లా మూడో స్థానంలో నిలిచింది.
ఆగస్టు 3వ తేదీ వరకు ఎన్యుమరేషన్
సర్ ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ, డిజిటలైజేషన్ను ఆగస్టు 3 వరకు ఎన్నికల కమిషన్ పొడిగించింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 3వ తేదీ నాటికి ఎన్యుమేషన్ను పూర్తి చేస్తారు. 10వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటిస్తారు. అదే రోజు నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి, అక్టోబర్ 8వ తేదీలోగా పరిష్కరిస్తారు. 12వ తేదీ తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు.
ఫ హైదరాబాద్, రంగారెడ్డి తర్వాత నల్లగొండలోనే అత్యధికం
ఫ సూర్యాపేట జిల్లా 66.92 శాతంతో 12వ స్థానం
ఫ సవరించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 3వ తేదీ వరకు గడువు
ఫ 10వ తేదీ నుంచి అభ్యంతరాలు స్వీకరణ
ఫ అక్టోబర్ 12న తుది ఓటరుజాబితా ప్రకటన
వివిధ జిల్లాల్లో బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) ఇంటింటికీ పంపిణీ చేసిన ఫారాలను తిరిగి తెప్పించుకొని డిజిటలైజేషన్ చేయడంలో నల్లగొండ జిల్లా మూడో స్థానంలో నిలిచింది. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల తర్వాత నల్లగొండలోనే అత్యధికంగా ఎన్యుమరేషన్ ఫారాలను డిజిటలైజ్ చేశారు. రంగారెడ్డి జిల్లాలో 38,99,743 మంది ఓటర్లు ఉండగా అత్యధికంగా 14,41,564 మంది నుంచి పూర్తి చేసిన ఎన్యుమరేషన్ ఫారాలను (మొత్తం ఓట్లతో పోల్చితే 38.97 శాతం) తెప్పించుకొని డిజిటలైజ్ చేశారు. హైదరాబాద్ జిల్లాలో 47,36,669 మంది ఓటర్లకు 13,53,173 మంది నుంచి (మొత్తం ఓట్లతో పోల్చితే 28.57 శాతం) పూర్తి చేసిన ఎన్యుమరేషన్ ఫారాలను డిజిటలైజ్ చేశారు. ఇక నల్లగొండ జిల్లాలో సంఖ్యాపరంగా అత్యధికంగా 11,84,302 మంది ఓటర్ల నుంచి పూర్తి చేసిన ఫారాలను డిజిటలైజ్ చేసి మూడో స్థానంలో నిలిచింది.


