పర్యాటక అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

పర్యాటక అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

Mar 14 2026 7:27 AM | Updated on Mar 14 2026 7:27 AM

నాగార్జునసాగర్‌ : తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నాగార్జునసాగర్‌లోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యాటక ప్రాంతాలను ప్రత్యేక టూరిజం కారిడార్లుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. పర్యాటక రంగం అభివృద్ధి చెందితే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. నందికొండ మున్సిపాలిటీలో గత ప్రభుత్వం ప్రారంభించి వదిలేసిన అభివృద్ధి పనులను పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈనెల 16 నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. అనంతరం ఆయనను స్థానిక నాయకుడు రాజగోపాల్‌రెడ్డి సన్మానించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, మధుకర్‌రెడ్డి, బ్రహ్మానందరెడ్డి ఉన్నారు.

రాష్ట్ర బడ్జెట్‌ ప్రజలకు ఉపయోగపడాలి

మిర్యాలగూడ : అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ప్రజలకు ఉపయోగపడేలా నిధుల కేటాయించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలుపరిచే విధంగా నిధులు కేటాయింపు ఉండాలన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం ప్రజలకు ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని చెప్పి వాటిలో ప్రస్తుతానికి మూడు మాత్రమే అమలులో ఉన్నాయని, మిగిలిన వాటిని తక్షణమే అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు. అర్హులైన పేదలందరికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్లాన్నారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు మల్లేష్‌, నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, శశిధర్‌రెడ్డి, మంగారెడ్డి, రవినాయక్‌, పరుశురాములు, వినోద్‌నాయక్‌ పాల్గొన్నారు.

భూగర్భ జలాల పెంపునకు కృషిచేయాలి

మునుగోడు : ఉపాధిహామీ పథకం ద్వారా భూగర్భ జలాలు పెంచే పనులు చేపట్టాలని కేంద్ర అధ్యయన బృందం సభ్యులు సూచించారు. శుక్రవారం మునుగోడు మండలంలోని పలు గ్రామాల్లో ఉపాధిహామీ పథకం ద్వారా చేపట్టిన చేపల చెరువులు, చెక్‌ డ్యామ్‌ల నిర్మాణ పనులను పరిశీలించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ అడుగంటున్న భూగర్భ జలాలు పెరగాలంటే చెక్‌ డ్యామ్‌లు, చేపల చెరువుల నిర్మాణం చేపట్టాలన్నారు. కార్యక్రమంలో కేంద్ర అధ్యయన బృందం సభ్యులు నవనీత్‌, రాచీగార్‌, ప్రతీప కోరేడే, ఏపీఓ శ్రీనివాస్‌, టెక్నికల్‌ అసిటెంట్లు నాగరాజు, అలివేలు, ఫీల్డ్‌ అసిటెంట్‌ శ్యామల, రైతులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement