నల్లగొండ: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఈనెల 6వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్లతో సమావేశమయ్యారు. ఈ సదస్సులో నల్లగొండ కలెక్టర్ బి.చంద్రశేఖర్ పాల్గొన్నారు.
మీడియా అకాడమీ చైర్మన్కు సర్పంచ్ల సన్మానం
నార్కట్పల్లి: తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్రెడ్డి మంగళవారం ఆయన స్వగ్రామం నార్కట్పల్లి మండలం పల్లెపహాడ్కు వచ్చారు. ఈసందర్భంగా సర్పంచ్ సంగిశెట్టి రాణమ్మ, అమ్మనబోలు సర్పంచ్ కొంపెల్లి సైదులు, బాజకుంట సర్పంచ్ పల్లగొర్ల రాజు ఆయనను సన్మానించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి శ్రవణ్ కుమార్, మండల కార్యదర్శి పెండ్యాల శంకర్, సీపీఐ నాయకులు వనం వాసుదేవ్, వనం శీను, పులసాని శ్రీనివాస్ రెడ్డి, దుబ్బ నరసింహ, తీగల మల్లారెడ్డి పాల్గొన్నారు.
కరాటే అకాడమీ
ఏర్పాటు అభినందనీయం
మిర్యాలగూడ టౌన్ : కరాటే అకాడమీ ఏర్పాటు అభినందనీయమని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు. మిర్యాలగూడ పట్టణంలోని హౌజింగ్బోర్డులో సుమన్ షోటోఖాన్ అకాడమీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అకాడమీని సోమవారం రాత్రి ఆయన ప్రారంభించి మాట్లాడారు. మిర్యాలగూడలో తన పేరుతో కరాటే అకాడమీ ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు. మహిళలు, బాలికలు, బాలురు కరాటే నేర్చుకుంటే తనను తాను రక్షించుకునే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో సుమన్ షోటోఖాన్ అకాడమీ ఆఫ్ ఇండియా డైరెక్టర్, మాస్టర్ బూడిద సైదులు, అకాడమీ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ, మాస్టర్ బాండావత్ రామకృష్ణానాయక్ తదితరులున్నారు.
కార్మిక విభాగం రాష్ట్ర
అధ్యక్షుడిగా బాబుమాదిగ
కోదాడరూరల్ : మాదిగ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కోదాడకు చెందిన చింత బాబుమాదిగ నియమితులయ్యారు. మంగళవారం హైదరాబాద్లో టీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడిపాపన్న అధ్యక్షతన జరిగిన సమావేశంలో బాబును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యల సరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
ఉపాధ్యాయ వృత్తినే
అవమానించిన కమిషన్
సూర్యాపేట : తెలంగాణ విద్యా విధానం రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన తెలంగాణ విద్యా కమిషన్ ఉపాధ్యాయ వృత్తిని వేతనంతో వెలకట్టడం దురదృష్టకరమని, ఇది ఉపాధ్యాయ వృత్తికి అవమానకరమని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు తీకుల్ల సాయిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు ఇచ్చేది వేతనం కాదని, అది గౌరవభృతి అని తెలిపారు. సమాజంలో వెలకట్టలేని వృత్తి ఏదైనా ఉందంటే అది ఉపాధ్యాయ వృత్తి మాత్రమే అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ను పరిగణలోకి తీసుకోకుండా, విద్యారంగంలో నిష్ణాతులైన విద్యావేత్తలతో కొత్త కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు.


