
గ్రీవెన్స్ డేకు కచ్చితంగా రావాల్సిందే..
హాజరుకాని అధికారులకు ఫోన్ కాల్స్..
నల్లగొండ: ప్రజావాణి కార్యక్రమం (గ్రీవెన్స్ డే)కు హాజరుకాని జిల్లా అధికారులపై కలెక్టర్ ఇలా త్రిపాఠి సీరియస్ అయ్యారు. నల్లగొండ కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణి సందర్భంగా కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించి ఆయా సమస్యలను చర్చించేందుకు ఆయా శాఖలకు సంబంధించి ఇద్దరు, ముగ్గురు అధికారుల పేర్లను పిలువగా వారు రాలేదు. వారికి బదులు సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు రావడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు గాకుండా ఏ శాఖ నుంచి సిబ్బంది వచ్చారో నిలబడాలని చెప్పడంతో సోషల్ వెల్పేర్, మత్స్య శాఖ, చేనేత జౌళి శాఖ, మున్సిపాలిటీ తదితర శాఖలకు సంబంధించిన సిబ్బంది నిలబడ్డారు. అయితే సోషల్ వెల్పేర్ డీడీ శశికళను మొదట అడుగ్గా వస్తుందని జూనియర్ అసిస్టెంట్ చెప్పారు. ఆ తర్వాత మరో వ్యక్తిని అడుగ్గా ఆ శాఖ నుంచి ఇద్దరు హాజరయ్యారు. ఇతర శాఖల నుంచి కూడా అధికారికి బదులు ఇద్దరిద్దరు హాజరయ్యారు. దీంతో ఇదేమన్న సినిమానా..బైవన్ గెట్ వన్ లెక్క ఒక అధికారికి ఇద్దరు, ముగ్గురు సిబ్బంది వస్తున్నారు ఇదేమన్న తమషానా అధికారులు గ్రీవెన్స్కు హాజరు కాకపోతే నేనొచ్చేది దేనికంటూ సీరియస్ అయ్యారు.
సెలవులు సరిపోవడం లేదా..
సెలవులు వచ్చినయ్. ఇంకా సెలవులు సరిపోవడం లేదా ఎందుకు రాలేదంటూ వచ్చిన సిబ్బందిని కలెక్టర్ ప్రశ్నించారు. అదే సందర్భంలో ఎస్పీ వెల్పేర్ డీడీ శశికళ రావడంతో టైమ్ ఎంతయిదంటూ కలెక్టర్ ప్రశ్నించారు. సమయపాలన పాటించాలని ఆమెకు సూచించారు. చేనేత జౌళి శాఖ జూనియర్ అసిస్టెంట్ను మీ అధికారి ఎక్కడకు వెళ్లారని అడగ్గా చండూరు వెళ్లారని చెప్పగా ఇక్కడ జిల్లా సమావేశం వదిలిపెట్టి చండూరులో ఏంపని అంటూ మండిపడ్డారు. అదేవిధంగా ఫిషరీస్, కొందరు మున్సిపల్ కమిషనర్లకు బదులుగా సిబ్బంది హాజరు కావడంతో సీరియస్ అయ్యారు. తప్పనిసరిగా అధికారులంతా సమయానికి గ్రీవెన్స్కు హాజరు కావాలన్నారు. అధికారులు రాకుంటే నేనెవరితో మాట్లాడాలి. ప్రజల సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయమంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
హాజరుకాని సంబంధిత అధికారులకు సీసీ ద్వారా ఫోన్ చేయించి హాజరు కావాలని ఆదేశించారు. దీంతో గ్రీవెన్స్ అంతా గతంలో ఎప్పుడూలేని విధంగా అధికారులు మూడు రోజులు సెలవులు వచ్చినా సోమవారం గ్రీవెన్స్కు హాజరు కాకపోవడంపై మొదటిసారిగా కలెక్టర్ మండిపడ్డారు. గ్రీవెన్స్ సమావేశాలకు కచ్చితంగా హాజరు కావాల్సిందే అని ఆమె ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రజావాణి కార్యక్రమం హాట్హాట్గా కొనసాగింది.
ఫ హాజరుకాని అధికారులపై కలెక్టర్ ఇలా త్రిపాఠి సీరియస్
ఫ కిందిస్థాయి సిబ్బందిని పంపిన కొందరు
ఫ ఎందుకు రాలేదంటూ సిబ్బందిని ప్రశ్నించిన కలెక్టర్
ఫ అధికారులు రాకుంటే తానొచ్చేది ఎందుకని మండిపాటు