
సన్న బియ్యంపై తప్పుడు ప్రచారం తగదు
ఫ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్
నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్న బియ్యం పంపిణీపై తప్పుడు ప్రచారం చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకనటలో హెచ్చరించారు. ఇటీవల గోదావరిఖనికి చెందిన ఒక వ్యక్తి రేషన్షాపులో సన్నబియ్యానికి బదులుగా ప్లాస్టిక్ బియ్యం సరఫరా చేస్తున్నారని పేర్కొంటూ సోషల్ మీడియాలో తప్పుడు వీడియో పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నం చేశాడని.. ప్రభుత్వం వెంటనే అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని తెలిపారు. రేషన్దుకాణాల ద్వారా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పోర్టిఫైడ్ సన్నబియ్యాన్ని ఎవరైనా కించపరిచే ప్రయత్నం చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సన్న బియ్యం పంపిణీపై ప్రజల్లో మంచి స్పందన ఉందని, ప్రజలంతా సంతోషంగా సన్నబియ్యాన్ని స్వీకరిస్తున్నారని తెలిపారు. ఈ పథకాన్ని నీరుగార్చేందుకు కొంతమంది చేసే తప్పుడు ప్రయత్నాలు ప్రభుత్వం సహించదని తెలిపారు.
పలువురు జడ్జిల బదిలీ
రామగిరి(నల్లగొండ) : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలువురు జడ్జిలు మంగళవారం బదిలీ అయ్యారు. ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద మెదక్ నుంచి సూర్యాపేటకు బదిలీ అయ్యారు. ఫ్యామిలీ కోర్టు జడ్జి పి.ముక్తిదా ఎల్బీనగర్ నుంచి యాదాద్రి జిల్లా మొదటి అదనపు కోర్టుకు బదిలీ అయ్యారు. మొదటి అదనపు కోర్టు జడ్జి డాక్టర్ ఎం.శ్యాం శ్రీ సూర్యాపేట నుంచి సికింద్రాబాద్ ఫ్యామిలీ కోర్టుకు బదిలీ అయ్యారు.
పునరావాసం ఏర్పాటుకు స్థల పరిశీలన
మర్రిగూడ : శివన్నగూడ రిజర్వాయర్లో ముంపునకు గురవుతున్న చర్లగూడెం భూ నిర్వాసిత రైతులకు పునరావాసం కల్పించేందుకు అధికారులు మంగళవారం చర్యలు చేపట్టారు. చింతపల్లి మండల పరిధిలోని వర్కాలలో 40 ఎకరాల స్థలాన్ని ఇళ్లకు కేటాయించేందుకు చండూరు ఆర్డీఓ వి.శ్రీదేవి, ఇరిగేషన్ ఈఈ రాములునాయక్ ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ వీలైనంత త్వరగా పునరావాసం కల్పించే ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఈ సందర్భంగా చర్లగూడెం గ్రామస్తులు మాట్లాడుతూ ఇంటి స్థలాల కేటాయింపు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కోరారు. గతంలో చింతపల్లి మండలంలోని మదనాపురం గేట్ వద్ద పునరావాసం కల్పిస్తామని ప్రకటించి రద్దు చేశారని వాపోయారు.
స్మార్ట్ వర్క్, బ్యాంక్
సేవింగ్స్పై అవగాహన
నల్లగొండ టౌన్ : స్మార్ట్ వర్క్, విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులకు అవసరమైన కోర్సులు, బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలపై ఐక్యరాజ్యసమితి విద్యా మండలి సభ్యుడు వెంకట రమణారావు, నల్లగొండ కోఆపరేటివ్ బ్యాంకు సీనియర్ మేనేజర్ రవీందర్ మంగళవారం నల్లగొండలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులు లక్ష్యాలు సాధించడానికి రోజు వారి జీవితంలో ఎలా అభివృద్ధి సాధించాలి అనే దానిపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లలితకుమారి, వైస్ ప్రిన్సిపాల్ ఎన్.పావని, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
నృసింహుడికి
సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం సంప్రదాయ పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా చేపట్టారు. గర్భాలయంలోని స్వయంభూలు, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం, తులసీదళ అర్చన చేశారు. శ్రీసుదర్శన హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం నిర్వహించారు. సాయంత్రం సాయంత్రం వెండి జోడు సేవలను ఆలయ మాడ వీధిలో ఊరేగించారు.

సన్న బియ్యంపై తప్పుడు ప్రచారం తగదు