
తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు మృతి
ఆలేరురూరల్: తాటిచెట్టు పైనుంచి జారి పడి గీత కార్మికుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం ఆలేరు మండలంలో చోటు చేసుకుంది. స్థాని కులు తెలిపిన వివరాల ప్రకారం.. శారాజిపేట గ్రామానికి చెందిన దూడల ఆంజనేయులు(45) కుల వృత్తిలో భాగంగా ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తు కాలు జారి తాటి చెట్టు పైనుంచి కింద పడడంతో తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
కుటుంబ సభ్యులకు
వృద్ధురాలు అప్పగింత
నల్లగొండ: కర్ణాటక రాష్ట్రానికి చెందిన వృద్ధురాలిని కలెక్టర్ శుక్రవారం ఆమె కుటుంబసభ్యులకు అప్పగించారు. వృద్ధురాలు నాగమ్మ తన ఇంట్లో సమస్యల కారణంగా మనస్థాపానికి గురై నల్లగొండకు వచ్చింది. సామాజిక కార్యకర్త శ్రీకాంత్ గత మూడు రోజుల క్రితం రైల్వే స్టేషన్లో వృద్ధురాలిని గుర్తించాడు. ఆమె వివరాలు అడిగి వయోవృద్ధుల శాఖకు సమాచారం ఇచ్చాడు. దీంతో వయోవృద్ధుల శాఖ అధికారి కృష్ణవేణి మెడికల్ కళాశాలలో చేర్పించాలని ఆదేశాలు ఇవ్వడంతో ఆమెకు ఇక్కడ ఆశ్రయం కల్పించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు శుక్రవారం నల్ల గొండకు రాగా కలెక్టర్ ఇలా త్రిపాఠి సమక్షంలో కుటుంబ సభ్యులకు అప్పగించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ నాగిరెడ్డి, శ్రీకాంత్ సునీల్ పాల్గొన్నారు.
రేషన్ బియ్యం పట్టివేత
కోదాడరూరల్: రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఆంధ్రప్రదేశ్కు తరలిస్తున్న ఆటోను కోదాడరూరల్ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. ఎస్ఐ అనిల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అనంతగిరి పోలీస్స్టేషన్ పరిధిలోని తమ్మరబండపాలేనికి చెందిన షేక్. సికిందర్ కోదాడ మండల బీక్యాతండాలో రేషన్కార్డుల దారుల నుంచి నాలుగు క్వింటాళ్ల పాత రేషన్ బియ్యాన్ని తక్కువ రేటుకు కొనుగోలు చేశాడు. వాటిని ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం రామిరెడ్డిపల్లికి చెందిన భరత్ కుమార్కు విక్రయించేందుకు వెళ్తున్నాడు. కూచిపూడి వద్ద పోలీసులు, సివిల్ సప్లై అధికారులు తనిఖీలు చేస్తుండగా పట్టుబడ్డారు. ఈమేరకు సికిందర్పై కేసు నమోదు చేసి ఆటోను సీజ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు మృతి