అచ్చంపేట/ లింగాల: అచ్చంపేట సబ్ కలెక్టర్ కార్యాలయం (ఆర్డీఓ) నూతన సబ్ కలెక్టర్గా సలోని ఛాబ్రా గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఆర్డీఓగా పనిచేసిన యాదగిరి బదిలీపై హైదరాబాద్ సీసీఎల్ఏకు వెళ్లారు. హర్యానా రాష్ట్రం గుర్గ్రామ్కు చెందిన ఆమె 2024లో ఐఏఎస్కు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఈమెను అచ్చంపేట సబ్ కలెక్టర్గా నియమించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన సబ్ కలెక్టర్కు అచ్చంపేట తహసీల్దార్ సైదులుతోపాటు బల్మూర్, లింగాల, అమ్రాబాద్, ఉప్పునుంతల, పదర మండలాల తహసీల్దార్లు ఘనంగా సన్మానించి.. అభినందనలు తెలిపారు.
చెంచుల ఇళ్ల స్థలాల పరిశీలన
లింగాల మండలంలోని చెన్నంపల్లిలో చెంచులకు ఇచ్చిన ఇళ్ల స్థలాల భూమి వివాదాస్పదంగా మారడంతో సబ్ కలెక్టర్ సలోని ఛాబ్రా పరిశీలించారు. జిల్లాకేంద్రంలో జరిగిన ప్రజావాణిలో ఎర్రపెంట, చెన్నంపల్లి చెంచులు ఈ భూమిపై కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు సబ్ కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 2005లో సర్వే నం.436లో 4 ఎకరాల భూమిలో ఎర్రపెంట, చెన్నంపల్లికి చెందిన 72 మంది చెంచులకు ఇళ్ల స్థలాలు కేటాయించగా.. వారు పూర్తిస్థాయిలో నిర్మించుకోలేదు. దీంతో కాలానుగుణంగా స్థలం ఆక్రమణకు గురికావడం, కొందరు చెంచుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కొనుగోలు చేశారు. ఈ మేరకు చెంచులతో వివరాలు తెలుసుకున్న సబ్ కలెక్టర్ నివేదికను కలెక్టర్కు అందజేస్తానని, చెంచులకు న్యాయం చేసేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేష్, ఆర్ఐ ఇందిర, సర్పంచులు శ్రీశైలం, లలిత, నాయకులు గోవింద్, చిరంజీవి, చెంచులు పాల్గొన్నారు.


