అచ్చంపేట రూరల్: అధికారులు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని అచ్చంపేట ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలు శాఖల అధికారులతో వేర్వేరుగా నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ.. అర్హులైన వారికి సంక్షేమ ఫలాలు అందించాలన్నారు. గ్రామీణ స్థాయిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని అన్నారు. ముఖ్యంగా రైతుల సంక్షేమం, సాగునీటి నిర్వహణ, ప్రభుత్వ పథకాల అమలుపై నిర్లక్ష్యం చేయొద్దన్నారు. ఎల్నినో కారణంగా నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు, సాగునీటి కొరతను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎల్నినో ప్రభావంపై రైతులకు ముందస్తు అవగాహన కల్పించడంతో పాటు వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే సూచించారు.


