చారకొండ: ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి.. వారిలో విద్యా నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేయాలని డీఈఓ రమేశ్కుమార్ సూచించారు. సోమవారం చారకొండ కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థినుల అభ్యసన సామర్థ్యాలను తరగతుల వారీగా పరిశీలించారు. విద్యార్థినులకు అందించే భోజనం నాణ్యతను పరిశీలించి.. వంట నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని.. ఆహారంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. చదువులో వెనకబడిన విద్యార్థినులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను విద్యార్థినులు సద్వినియోగం చేసుకొని చదువులో రాణించాలని తెలిపారు. డీఈఓ వెంట ఎస్ఓ మంజుల ఉన్నారు.


