నాగర్కర్నూల్: పాలకుల వైఫల్యంతో రైతులకు ఇబ్బందులు కలుగుతున్నాయని మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి విమర్శించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను సందర్శించిన ముఖ్యమంత్రి, మంత్రులు వెంటనే రూ. 1,000 కోట్లు మంజూరు చేస్తామని ఇచ్చిన హామీని ఎందుకు నిలబెట్టుకోలేదని ప్రశ్నించారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను నార్లాపూర్ వద్ద ప్రారంభిస్తే.. కేఎల్ఐకి ఇబ్బందులు ఏర్పడతాయని లేఖలు రాసినా పట్టించుకోకపోవడంతో ఐదు మోటార్లు ధ్వంసమయ్యాయన్నారు. సంవత్సరాలు గడుస్తున్నా వాటికి మరమ్మతు చేయించడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు కక్కుర్తి వల్లే ప్రభుత్వం కాల్వల సామర్థ్యం కుదించిందని.. నార్లాపూర్ నుంచి అండర్ గ్రౌండ్ పనులకు అనుమతులు కమీషన్ల వల్లే ఇచ్చారని ఆరోపించారు. వట్టెం రిజర్వాయర్ ద్వారా డిండి ప్రాజెక్టుకు నీటిని తరలించే అవకాశం ఉన్నా.. కమీషన్ల కోసం ఏదుల నుంచి నీటిని తరలించేందుకు నిధులను మంజూరు చేశారని విమర్శించారు. సాగునీటి పారుదలశాఖ మంత్రిగా ఉత్తమ్కుమార్రెడ్డి ఉండటంతో నల్లగొండ జిల్లాకు నీటిని తరలించేందుకు రూ. 1,800 కోట్లు మంజూరు చేశారని.. మరి ఈ ప్రాంత ఎమ్మెల్యేలు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ఉద్యమాల ద్వారానే ఉమ్మడి పాలమూరు ఆయకట్టుకు సాగునీరు అందుతుందని.. ఈ మేరకు రైతులను చైతన్యం చేసి పాలకుల వైఫల్యాలను ఎండగడతానని అన్నారు. సమావేశంలో నాయకులు నాగం శశిధర్రెడ్డి, అర్థం రవి, బాలాగౌడ్ ఉన్నారు.


