● రెవెన్యూ అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి
● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
పెంట్లవెల్లి: రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించమని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం పెంట్లవెల్లి మండలకేంద్రంలో ఆయన అధికారులతో సమావేశమై ప్రజా సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ సమస్యలను మంత్రికి వివరించారు. ప్రధానంగా భూ సమస్యలను పలువురు రైతులు ఏకరువు పెట్టారు. భూముల మ్యుటేషన్ కోసం రోజుల తరబడి మండల కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పరిష్కారం కావడం లేదని గోడు వెల్లబోసుకున్నారు. ఈ విషయంపై మంత్రి జూపల్లి తీవ్రంగా స్పందించారు. రోజుల తరబడి ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు. వివిధ సమస్యలపై కార్యాలయాలకు వచ్చే ప్రజలకు సత్వర పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. రెవెన్యూ సమస్యలను పెండింగ్లో ఉంచకుండా.. ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలని ఆదేశించారు. అన్నిశాఖల అధికారులు ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేయాలని.. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యాన్ని సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. గ్రామాల్లో క్రీడా మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి తెలిపారు. విద్యార్థులు, యువతలో క్రీడలపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేలా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో స్టేడియాల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం పెంట్లవెల్లిలో స్టేడియం నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని మంత్రి పరిశీలించారు. క్రీడా ప్రాంగణం కోసం 5 ఎకరాల భూమిని ఇస్తానని హామి ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్, ఆర్డీఓ భన్సీలాల్, తహసీల్దార్ భాస్కర్, రామన్గౌడ్, నర్సింహయాదవ్, గోపినాయక్, ఎండీ కబీర్, రూపం నాగరాజు పాల్గొన్నారు.


