లింగాల: సగరులను బీసీ డీ గ్రూపు నుంచి బీసీ ఏ గ్రూపులోకి మార్చే వరకు ఉద్యమిస్తామని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర అన్నారు. మండల పరిధిలోని అంబట్పల్లిలో శనివారం నిర్వహించిన సగర భగీరథ మహర్షి విగ్రహావిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ సందరర్భంగా సగర గ్రామ అధ్యక్షుడు వేముల లింగస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ సగరులు అన్ని రంగాలలో వెనుకబడి దుర్భర జీవితం గడుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సగరులను బీసీ ఏ లోకి మార్చుతూ జీవో 166ను విడుదల చేయగా ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు సగరులను తిరిగి బీసీ డీ లోనే కొనసాగిస్తున్నారన్నారు. సగరులను బీసీ ఏ గ్రూపులోకి మార్చడానికి అధికారంలో ఉన్న ప్రస్తుత ప్రభుత్వ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతకు ముందు భగీరథ మహర్షి విగ్రహాన్ని ఊరేగింపు నిర్వహించారు. అనంతరం విగ్రహాన్ని సగర కమ్యూనిటీ భవనం దగ్గర ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర గౌరవాధ్యక్షులు ముత్యాల హరికిషన్, జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, గ్రామ సర్పంచు శ్రీవాణి హన్మంత్రెడ్డి, పలువురు రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.


