● విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత పాటించాలి
● రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్
గోలి శ్రీనివాస్రెడ్డి
కందనూలు/కల్వకుర్తి టౌన్: జాతీయ ఆహార భద్రత చట్టం–2013ను పకడ్బందీగా అమలు చేస్తూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆహార భద్రత, పోషకాహారం, మాతృత్వ ప్రయోజనాలు అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి సూచించారు. బుధవారం ఫుడ్ కమిషన్ సభ్యులు ఓరుగంటి ఆనంద్, శారదాలతో కలిసి కల్వకుర్తి పట్టణంలోని పలు రేషన్ దుకాణాలు, గురుకుల పాఠశాల, కళాశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అనంతరం కలెక్టరేట్లో కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధ్యక్షతన జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. ఆహార భద్రతకు సంబంధించిన పథకాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. పాఠశాలల్లో విద్యార్థులకు పోషకాలతో కూడిన నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనంపై పాఠశాల స్థాయిలోనే కాకుండా, సంబంధిత అధికారులు కూడా క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న ఆహార పదార్థాల నాణ్యత, పరిమాణం, పంపిణీ విధానం, లబ్ధిదారుల హాజరు తదితర అంశాలను అధికారులు పరిశీలించాలని ఆదేశించారు.
కల్వకుర్తిలోని హనుమాన్ నగర్, సుభాష్నగర్ అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో ఫుడ్ కమిషన్ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు చేపట్టగా.. మెనూ అమలు, భోజనం నాణ్యత, రికార్డుల నిర్వహణలో లోపాలు బయటపడ్డాయి. అంగన్వాడీ చిన్నారులకు ఇస్తున్న గుడ్లు చిన్న పరిమాణంలో ఉండటంపై చైర్మన్ అసహనం వ్యక్తం చేశారు. బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు అందించే భోజనంలో నాణ్యత పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మెనూలో ఉన్న ఆహారానికి బదులు కేవలం పప్పుచారు వడ్డించిన వంట ఏజెన్సీ నిర్వాహకులను మందలించారు. పాఠశాలలపై పర్యవేక్షణ పెంచాలని డీఈఓ రమేశ్కుమార్కు సూచించారు. బీసీ గురుకుల జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం చికెన్తో భోజనం అందించకపోవడంపై సిబ్బందిని ప్రశ్నించారు. దీనిపై సిబ్బంది పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అసహనం వ్యక్తం చేశారు. డీసీఓ, పాఠశాల ప్రిన్సిపల్కు మెమోలు జారీచేయాలని సూచించారు. అదే విధంగా బాలుర ఉన్నత పాఠశాల హెచ్ఎం బాలుకు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని డీఈఓను ఆదేశించారు. వారి వెంట అదనపు కలెక్టర్ దేవ సహాయం, డీడబ్ల్యూఓ ఉమాపతి, డీఎంహెచ్ఓ కృష్ణ, డీటీడబ్ల్యూఓ కోటాజీ, డీఆర్డీఓ ఓబులేష్, మహిళా శిశు సంక్షేమశాఖ అధికారి పాండు, ఆర్డీఓ జనార్దన్రెడ్డి, తహసీల్దార్ ఇబ్రహీం, ఎంఈఓ శంకర్నాయక్ ఉన్నారు.


