అచ్చంపేట రూరల్: విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యత లోపించొద్దని డీటీడీఓ ఆర్.కోటాజీ అన్నారు. మంగళవారం అచ్చంపేట మండలంలోని సిద్ధాపూర్ ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ.. విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు అందిస్తున్న భోజన మెనూ, వండిన ఆహార పదార్థాలను పరిశీలించారు. ఆయన వెంట హెచ్ఎం మల్లేష్ ఉన్నారు.
రాజకీయ ఖైదీలను విడుదల చేయండి
అచ్చంపేట: ప్రజాసమస్యల పరిష్కారం, సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న వారిని జైళ్లలో నిర్బంధించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి జక్క బాలయ్య, కుల నిర్మూలన పోరాట సమితి నాయకుడు లక్ష్మీనారాయణ అన్నారు. రాజకీయ ఖైదీలను తక్షణమే విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం అచ్చంపేట ప్రెస్క్లబ్లో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజా హక్కులు, సామాజిక న్యాయం కోసం పోరాడే వారిని ప్రభుత్వం గౌరవించాల్సి ఉండగా.. వారిపై నిర్బంధ చర్యలకు పాల్పడటం సరికాదన్నారు. ప్రభుత్వాలు ప్రజాస్వామ్య విలువలను విస్మరించి.. ప్రజా ఉద్యమాలను అణచివేసే విధంగా వ్యవహరించడం ఆందోళనకరమన్నారు. రాజకీయ, ప్రజాస్వామ్య ఉద్యమాల్లో పాల్గొన్న వారిని విడుదల చేసి.. వారి కుటుంబాలకు భరోసా కల్పించాలని వారు డిమాండ్ చేశారు. రాజకీయ ఖైదీల విడుదల కోసం ఈ నెల 20న రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం పోస్టర్లు ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా పౌరహక్కుల సంఘం ఉపాధ్యక్షుడు పంబలి బాలయ్య, ముద్దునూరి లక్ష్మీనారాయణ, ఇమ్మడి విజయమోహన్, బియ్యం శ్రీశైలం, కాట్రవత్ శ్రీనునాయక్, సీఎల్సీఎన్ లక్ష్మీనారాయణ, వెంకటేశ్ ఉన్నారు.


