కల్వకుర్తి రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగదారుల ఇబ్బందులను గుర్తించి ఒకేసారి మూడు నెలల రేషన్ సరఫరా కోసం ఆదేశాలు జారీ చేశాయి. ఈ క్రమంలో ఈ నెల 1 నుంచి వినియోగదారులకు రేషన్ బియ్యం సరఫరా చేస్తుండగా.. కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఇప్పటి వరకు రేషన్ బియ్యం సరఫరా కాలేదు. కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలోని కల్వకుర్తి, వెల్దండ, ఊర్కొండ, చారకొండ, వంగూరు మండలాల్లో మొత్తం 132 రేషన్ షాపులు ఉన్నాయి. ఇందులో కేవలం 9 రేషన్ షాపులకు మాత్రమే బియ్యం సరఫరా జరిగాయి. దీంతో వినియోగదారులు ఆయా గ్రామాల్లో రేషన్ షాపుల చుట్టూ తిరిగి బియ్యం లేవనడంతో వెళ్లిపోతున్నారు. స్టేజ్–1 నుంచి బియ్యం కల్వకుర్తి ప్రాంతానికి సరిగా రావడం లేదని తెలిసింది. స్టేజ్–2లోనూ సమస్యలు తలెత్తడం వినియోదారులకు శాపంగా మారింది. ఒకేసారి మూడు నెలల బియ్యం సరఫరా కావడంతో కొన్ని షాపులలో బియ్యాన్ని నిల్వ చేయడం కూడా సమస్యగా ఉంది. కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలో బియ్యం సరఫరా ప్రారంభం కాకపోవడంపై వినియోగదారులు, డీలర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.
● ఈ విషయమై గోదాం ఇన్చార్జి శశిధర్రావు స్పందిస్తూ.. కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలో 9 షాపులకు బియ్యం సరఫరా చేశామని, మిగతా షాపులకు రెండు రోజుల్లో పంపిస్తామని చెప్పారు. స్టేజ్–2 కాంట్రాక్టర్ తనకు గిట్టుబాటు కావడం లేదని జిల్లా అధికారులకు రేటు పెంచాలని దరఖాస్తు చేసుకున్నారని అందువల్లే సరఫరా నిలిచిపోయిందని ఆయన పేర్కొన్నారు.


