ములుగు: శ్రావణమాసంలో సౌభాగ్యం, సంపదలు, కుటుంబ శ్రేయస్సు కోసం మహిళలు ఆచరించే వాటిలో ప్రధానమైన వరలక్ష్మీ వ్రతాన్ని శుక్రవారం జిల్లావ్యాప్తంగా మహిళలు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఉదయాన్నే తలంటు స్నానమాచరించి ఇంటి ముందు గుమ్మాలకు మామిడాకులతో అలంకరించారు. వారి వారి ఇళ్లల్లో ఇష్టదైవమెన లక్ష్మీదేవి అమ్మవారి ప్రతిమను బంగారు ఆభరణాలు, నగదు, పూలతో సుందరంగా అలంకరించారు. అమ్మవారి వద్ద పవిత్ర కళశాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు ఒకరికొకరు వాయినాలు ఇచ్చుకున్నారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయంలో ఆలయ ఈఓ ఇమ్మడి భాస్కర్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు హరీష్శర్మ, ఉమాశంకర్లు వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించగా మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు. అనంతరం రామప్ప రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు.


