● ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో
ఏటూరునాగారం: గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తానని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. మండల కేంద్రంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శనివారం ఐటీడీఏలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓ జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. అనంతరం గిరిజన భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పీఓ మాట్లాడారు. ఏజెన్సీలోని గిరిజనులకు విద్య, వైద్యం అందేలా చూడడంతో పాటు వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఐటీడీఏ కృషి చేస్తుందని తెలిపారు. ఇందులో భాగంగానే మేడారం జాతరకు రూ.150 కోట్లను విడుదల చేసి పలు అభివృద్ధి పనులను చేపట్టామన్నారు. గిరిజన విద్యార్థులు విద్యాభ్యాసానికి ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లా ఆస్పత్రితో పాటు 3 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 22 పీహెచ్సీలు, 128 ఆరోగ్య ఉపకేంద్రాల్లో ప్రతిరోజూ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నట్లు పీఓ వివరించారు. యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామన్నారు. అనంతరం విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకర్షణగా నిలిచాయి. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంస పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ మనన్భట్, విద్యార్థులు, గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు.


